అనుచరులు

14.8.15

కర్తవ్యం

 భరతమాత పులకించగ బంగరు బాటలు వేద్దాం
కర్మ భూమి జన్మభూమి కన్న ఋణం తీరుద్దాం

కలిమి లేమి అడ్డుగోడలు చదువుతోటి కూలతోద్దాం
కులమతాల ముళ్ళకంపలు చెలిమి తోటి దాటివేద్దాం

విద్యవిత్తును నాటుదాము ఇంటింటి ముంగిటిలో
వలసపోయే విత్తమును ఇకనైనా ఆపుదాం

ధనము కోసము దారి మళ్ళితె దేశమునకె దారిద్ర్యం
బ్రతకనిచ్చి బ్రతుకుదాం కలిసిమెలిసి అందరం

పచ్చదనం ప్రతి చోటా పరుచుకుంటూపోదాం
వెచ్చదనం ప్రబలకుండా ఇలను ఆదుకుందాము

ఆడపిల్లలె ఆధారం మనిషి జాతి మనుగడకి
ఆదరించి సాగుదాం అంతరాలు మానుకుని

విశ్వమంతా చాటినాము వివాహపు విశిష్టతను
వీడకుండ ఒకరినొకరు తోడునీడై నడుద్దాం

తల్లివేరునె తుంచగోరితె తరువుమీదికి తెగిపడదా?
తల్లిదండ్రులె మూలాలని గురుతెరిగి మసులుదాం

స్వార్ధబుద్ధిని మానుకుందాం శాంతిమంత్రము చదువుదాం
ఉజ్జ్వల భవితను తెచ్చే ఉషోదయాన్ని కోరుదాం!!!!

15.1.15

భానుమతి గారి అత్త



నమస్కారం!సంక్రాంతి శుభాకాంక్షలు.ఈ మధ్య చాలా కాలంగా తెలుగుతీరాలకు దూరంగా ఉన్నాను.ఎన్ని పుస్తకాలు చదివానంటే,సమీక్ష రాయాలంటే, దేని గురించి రాయాలో అర్ధం కావట్లేదు.అయినా తప్పకుండా ప్రస్తావించాల్సిన పుస్తకం, "అత్తగారి కథలు". ఇది నాకు చాలా ఇష్టమైన కధానాయిక భానుమతి రాసిన కధా సంపుటి.ఇప్పుడొక చిక్కు! భానుమతి గురించి బ్లాగాలా? అత్తగారి కధల గురించి బ్లాగాలా? భానుమతి గురించి మొదలెడితే నన్నెవరూ ఆపలేరు, కాబట్టి ఎవరూ చదవలేరు.అందుకే ఇప్పటికి "అత్తగారి కధల" గురించే బ్లాగుతా.పెద్దవారికి ఇది సుపరిచితమే అయినా, ఈతరం వారికి తెలియాల్సిన అవసరం ఉంది.ఆంగ్ల సాహిత్యం వారు చెప్పే 'సిట్ కాం' ప్రక్రియలో ఉంటుంది ఈ సంపుటి. అంటే ఒకే ప్రదేశంలో ఉండే కొన్ని పాత్రల మధ్య జరిగే సన్నివేశాల వలన పుట్టే హాస్యం అన్నమాట. అనాదిగా అత్తగారి పాత్రంటే గయ్యాళిగా, రాక్షసిగా చలామణి అవుతున్న రోజుల్లో, భానుమతి ప్రాణం పోసిన అద్భుతమైన అత్తగారు,మన ఈ బామ్మగారు. కొంచెం ఛాందసంగా,కొంచెం చిలిపిగా,కొంచెం గడుసుగా ఇలా చెప్పుకుంటూ పోతే అత్తగారి పాత్రలో లేని ఛాయ లేదు.ఈ పుస్తకం పూర్తి చేశాకా నాకెందుకో మన "అమ్రుతం" ధారావాహిక గుర్తొచ్చింది. అక్కడ అమ్రుతం, ఇక్కడ భానుమతి అని పూర్తిగా అనలేము, కాని అంజి లాగా ఈ అత్తగారు రకరకాల పనులు తెలిసీ తెలియక, ఒక విధమైన అమాయకపు పట్టుదలతో చేసేసి  ఆఖరికి తెల్లబోతూ ఉంటుంది . సర్వం లాగానే, ఇక్కడ కూడా ఒక తమిళ వంట అయ్యరు ఉంటాడు. కధాగమనం అంతా బ్రాహ్మణ గంభాస అయిన ఈ అత్తగారి ఇంట్లో రచించబడింది. ఆవకాయ తో ఆరంభించిన ఈ కధలు ఆవకాయ లాగే అద్భుతంగా ఉంటాయి కానీ అత్తగారు ఆవకాయని ఎలా  పెట్టారన్నది మాత్రం చదవాల్సినదే! కట్టుడు పళ్ళూ, కూర్మావతారం కధలైతే నవ్వలేక ఛఛ్ఛాను! నవలటానికి ఇన్ని పళ్ళే చాలంటూ, తక్కువ డబ్బులకి అన్ని పళ్ళూ కాక కొన్ని మాత్రమే కట్టించుకుని ఆవిడ పడే అవస్థ భలే ఉంటుంది.ఈ హాస్యం రాయటం అంతా ఒక ఎత్తయితే, అత్తగారి పాత్రకు గౌరవం తగ్గకుండా రాయటం ఒక ఎత్తు. అత్తగారు ఎక్కడా ఒక వెర్రి దానికి మల్లే అనిపించదు.కాబట్టే ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతిని సొంతం చేసుకుంది ఈ అత్తగారు!!

30.3.14

జయ నామ సంవత్సర జయగీతం

జయ నామ ఉగాది శుభాకాంక్షలు.ఉగాది పండుగ నాడు పంచాంగం చదవడం, పద్యాలు పాడడం తెలుగునాట సంప్రదాయంగా పాటిస్తాము గనుక, నేనెప్పుడో రాసిన ఈ పాట తెలుగుతీరాలకు చేరుస్తున్నాను.

పల్లవి:      నీ నామ సంకీర్తనే నా జన్మ సౌభాగ్యమే,
               నీ దివ్య సాన్నీధ్యమే, నిరతిశయానందమే..

చరణం:
           
 
1. పరబ్రహ్మ తత్త్వమ్ము పరిపరి విధాలుగ ప్రకటించు ప్రకృతివీ
      పరిపూర్ణతకై పురుషుని రూపుగ ఉదయించు శ్రీ శక్తివీ...ఉదయించు శ్రీ శక్తివీ..  
 
  2.ఏ కార్య సిద్ధతకు పరమాత్మ దేహాన జీవాత్ముడై వెలిసెనో
     ఆ జన్మ సాఫల్య పధమందు నడిపించి నను బ్రోవుమా భగవతి... నను బ్రోవుమా భగవతి
           
  3.నా హృదయ మందిరము నీ స్థిర నివాసముగ వసియించి నన్నేలుమా
    నా మనః ప్రాణములు నీ చరణ కమలాలు మన్నించి రక్షింపుమా..మన్నించి రక్షింపుమా..



20.1.14

కృష్ణాతీరాన సాహితీయాత్ర-2


చాలా కాలంగా మోపిదేవి చూడాలనుకోవడానికి దైవభక్తే కాక మరొక ప్రత్యేకమైన కారణముంది.మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతో ప్రసిధ్ధి. ఆలయం కట్టించినది చల్లపల్లి జమీందారుగారు.ఇది అందరికీ తెలిసినదే.ఐతే మా విశ్వనాధ సత్యనారయణ గారి వేయిపడగలు నవలకు నేపధ్యంగా ఎంచుకున్నది  మోపిదేవి స్వామినీ, చల్లపల్లి రాజుగారినేననీ 

మువ్వగోపాలుడు

పాండురంగాలయం  


 ఆ మధ్య అమ్మమ్మగారు చెప్పారు.ఇక అప్పటి నుంచి మోపిదేవి చూడాలని!! విజయవాడ నుండి మోపిదేవి దోవలోనే శ్రీకాకుళంమంటాడ (వేంకటేశ్వరుడు),చల్లపల్లి (కోట;నేనులోపలికివెళ్ళిచూడటం వీలు అవలేదు),కూచిపూడి (తెలుగు విశ్వవిద్యాలయం,కళాపీఠం,సిద్ధేంద్రయోగి మండపం)వున్నాయి.అన్నట్టు ఏకవీర నవలలో కూచిపూడి నాట్యవిన్యాసము నాకు అలలా గుర్తుకొచ్చింది.అలాగే సుమారు 6 కి.మి.దోవ చల్లపల్లి దగ్గర మారితే మొవ్వ కూడా ఉంది.  మొవ్వ లోనే తెలుగు పదకవిత ప్రాణం పోసుకున్నది. క్షేత్రయ్య పదాలుగా సుప్రసిధ్ధమైన మువ్వగోపాల పదాలను మౌద్గళ్యుడనే పిల్లవాడు కృష్ణపరమాత్మ అనుగ్రహంతో  ఊళ్ళోనే ఆశువుగా ఆలపించాడు.తరువాతి కాలంలో భారతదేశంలోని అనేక క్షేత్రాలను సందర్శిస్తూ మువ్వగోపాలుణ్ణి కీర్తిస్తూ పద్యాలు చెప్పటం వల్ల క్షేత్రయ్యగా పేరొందాడు.ఇంకాస్త దూరం వెళ్తే చిలకలపూడిగా పిలువబడే కీరపురం వుంది.ఇక్కడ కొలువైన కీరపండరినాధుడు స్వయంభువుగా చెప్పబడ్దాడు.  పాండురంగని ఆలయం ఎంత పెద్దదో అంతకన్నా ప్రశాంతమైనది.ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన స్థలమిది.నేను  గుళ్ళో ఉన్నప్పుడు ఒక చిన్న బాబు సుమారు 12 ఏళ్ళవాడు పాండురంగ బారో అంటూ స్వామిని రమ్మంటూ పాడాడండీ, ఆహా వాడి కంఠం!  రోజుకీ తలుచుకోగానే నా చెవిలో మ్రోగుతోంది.గానామృతం!!!  మచిలీపట్నంలో సముద్రతీరం,ఆపైనే హంసలదీవి చక్కటి ప్రదేశం.కృష్ణానది సముద్రంలో కలిసేది హంసలదీవిలోనే!ఇక్కడే చక్కటి కృష్ణాలయం ఉందట.అక్కడి వరకూ వెళ్ళడం నాకు కుదరలేదు.ఇంకెప్పుడైనా వెళ్ళాలి!

కృష్ణాతీరాన సాహితీయాత్ర-1

తెలుగదేలయన్న, దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులు గొల్వ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
అని పలికినవాడు శ్రీ కృష్ణ దేవరాయలు. పలికించినవాడు శ్రీకాకుళాంధ్రదేవుడు. మహావిష్ణువు రాయలి వారి కలలో కనిపించి పద్యము పలికి, గోదా కల్యాణము, తెలుగు భాష లో రచించమని ఆదేశించాడు.

ఆదేశము ఆయనకు కలిగినది కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళంలో! శ్రీకృష్ణదేవరాయలు విజయవాడ ఆక్రమించడానికి 1525 సంవత్సరంలో వచ్చి అప్పటికే ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్రమహావిష్ణువును కొలిచి,ఏకాదశి వ్రతమాచరించారు.ఆనాటి రాత్రి కలలోనే ఆముక్తమాల్యదకు బీజం పడినది.ఇంత చారిత్రక ప్రాసస్త్యం గల శ్రీకాకుళం విజయవాడ నుండి గంటే ప్రయాణం.మన చుట్టూ ఉన్న ఎన్నో గొప్ప ప్రదేశాలను విడిచి యాత్రలకు ఇంకెక్కడికో వెళుతున్నాం.అందుకే తెలుగు కవితా వైభవాన్ని చాటిచెప్పే శ్రీకాకుళం, మొవ్వ, మోపిదేవి మొదలైన ప్రాంతాలన్నీ చూసివచ్చాను. .విజయవాడ నుండి పగలు 5 గంటలకు బయల్దేరితే, తిరిగి సాయంత్రం 6 గంటలకు విజయవాడకు వచ్చేశాం.శ్రీకాకుళంలోని విష్ణువు, ఆంధ్రమహావిష్ణువుగా పిలవబడుతాడు.ఇక్కడి వైష్ణవాలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది.ఆలయంలోని కుడ్యాల అందం వర్ణనాతీతం.మూలవిరాట్టులో జీవకళ ఉట్టిపడుతోంది.స్వామివారి కళ్ళూ,చేతి వేళ్ళూ ఎంత సజీవంగా అనిపిస్తాయో. మూర్తి రాలి( కోన సీమ)లోని మొహిని అవతారాన్ని పోలి ఉంది.అక్కడి విగ్రహం చుట్టూరా దశావతారాలు చెక్కినట్టే,ఇక్కడా ఉన్నాయి.గుడి ఆవరణ కూడా చాల పెద్దది. ఒకప్పుడు ఊరు రావాలంటే పడవ ప్రయాణం తప్పనిసరి.కాని ఇప్పుడు చక్కటి రహదారులున్నాయి.గుళ్ళోని ఆముక్త మాల్యద మండపంలో రాయలవారి విగ్రహముంది. అలగే రాయలువారు చెక్కించిన శిలాశాసనాలు ఆలయం మీద చూడవఛ్చు. చాలా వరుకూ అరిగిపోయి ఉన్నాయి అక్షరాలు.
ఇంకా దురదృష్టం ఏమంటే హతవిమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ మకుటంతో ప్రసిధ్ధమైన ఆంధ్ర శతకం చెక్కబడిన శిలలు పాడుబడిన ఒక పెంకుటింట్లో గుడి వెనుకనున్నాయి.విష్ణువు కృపతో పలికిన సరస్వతి సరైన ఆవాసం లేకుండా ఉండటం బాధాకరం.ప్రభుత్వం తలుచుకుంటే అదేం అంత పెద్ద పని కాదు

15.1.14

గొబ్బిళ్ళకు ప్లాస్టిక్ గ్రహణం

  అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.ఈ ఏడు భోగి మంటలు వేయలేదు.కానీ తెలుసున్న వాళ్ళింటికి బొమ్మలకొలువు పేరంటానికి వెళ్ళొచ్చా. భోగి రోజు సాయంత్రం సందె గొబ్బెమ్మలకూ మమ్మల్ని పిలిచినా వెళ్ళడం కుదరలేదు.మర్నాడు  బొమ్మలుకు వెళ్ళాము.అమ్మమ్మగారూ వాళ్ళూ కూడా చాలా ఏళ్ళ తరువాత ఈ ఏడే గొబ్బిళ్ళు పెట్టారట.వాళ్ళింటి పక్కనే ఉన్న గుళ్ళో గోశాల ఉంటే  అక్కడినించి పేడ తెచ్చి కానించారు.ఇంతకు మునుపు ఆవు పేడ దొరికేది కాదా అని నేను అడిగితే వాళ్ళన్న మాట ఠక్కుమనిపించింది.ఈ గుళ్ళో ఆవులు బయటకి వెళ్ళవట, మేత అక్కడే తింటాయట.చాలా మటుక్కు ఆవుల్ని బయటకు వదిలేయడం వల్ల,అవి దారిలో ఉండే ప్లాస్టిక్  కాగితాలు, చెత్తా చెదారం తిని తిరుగుతాయి. ఈలాటి ఆవు పేడతో గొబ్బెమ్మలు చెయలేమట!!సరిగ్గా గుండ్రంగా అయ్యి గొబ్బెమ్మలా అందంగా ఉండవు, అందులోని ప్లాస్టిక్ అవశేషాలు వల్ల! ఇన్నాళ్ళూ పశువులు ప్లాస్టిక్ తినడం వలన మంచి పాలు దొరకవనుకున్నాను గానీ ఇలా గొబ్బెమ్మలకీ కాలం చెల్లిపోవటానికీ ప్లాస్టిక్ కారణమవుతుందనుకోలేదు!!!ముగ్గులూ,గొబ్బిళ్ళూ,బొమ్మలూ ఇవి మన సత్సాంప్రదాయాలు !! కోడి పందాలు, జంతు బలులూ అమానుషం. మనిషి ఇతర జంతువుల కన్న గొప్పవాడైనప్పుడు,బలవంతుడైనప్పుడూ వాడు తనకన్నా నిర్బలులనికాపాడాలి తప్ప హాని చేయకూడదని గాంధీ గారు చెప్పిన మాట నాకు నచ్చిన మాట. ఈ పండుగ నాడు జరిగే అమానుషత్వానికి అంతం పలికి, అందరూ సత్సాంప్రదాయాలను పాటించాలని కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.    

29.8.13

అసమర్థుని జీవయాత్ర

చాలా రోజుల తరువాత తెలుగు నవల చదవాలనిపించి, పుస్తకం కోసం వెతుకుతుంటే అసమర్థుని జీవయాత్ర అనే ఈ నవల గురించి తెలిసింది.త్రిపురనేని గోపీచంద్ రాసిందీ నవల.ఈ పుస్తకం చదివాకా నాకు పుట్టుకొచ్చిన చిరాకు అంతా ఇంతా కాదు!ఈ కధాంశం నుండి పాఠకులేం తెలుసుకోవాలని రచయిత కోరుకున్నాడో నాకర్ధం కాలేదు.సీతారామారావు ఈ నవలలో కధానాయకుడు! కాదు కాదు కధానయకుడనడానికి లేదు, ముఖ్య పాత్ర!
వీడంత వెధవ ఇంకోడు ఈ భూమి మీద ఎక్కడా పుట్టి ఉండడు,పుట్టడు (కనీసం ఊహల్లో కూడా పుట్టడు!)అని మొదటి నాలుగైదు కాగితాలు తిరగేస్తేనే అర్థమైపోతుంది.వీడికి మనుషులు నచ్చరు,కుటుంబ వ్యవస్థ నచ్చదు,తల్లిదండ్రులు,అత్తమామలు,భార్యాబిడ్డలు,ఇలా ఏ మానవసంబంధాలూ ఇష్టముండవు.వీడికి పెళ్ళి వద్దట!కానీ ఇంట్లో వాళ్ళను కాదనలేక పెళ్ళాడతాడు.మరి ఇంత పెళ్ళి ఇష్టం లేని వాడూ పెళ్ళం తోనే ఉంటాడు, పిల్లల్ని కంటాడు. కానీ వీడికి ఎవరన్నా ఇష్టం లేదు!వాడి నిరాశానిస్ప్రుహల్లో వాడుంటాడు, చివరికి చాలా క్రూరంగా ఆత్మహత్య చేసుకుని చస్తాడు.అదీ స్మశానంలో ఆత్మహత్య!

అసమర్థులూ,నిరాశావాదులూ,తమ ఈ అశక్తతను అధగమించడం ఎలాగో చెప్పడం మానేసి,ఒక విషాదభరిత,విషపూరిత కధాంశాన్ని పాఠకులకు అందించడంలో రచయిత ఉద్దేశ్యం ఏమిటో??  

4.7.13

మొల్ల (కవులకధలు)-రెండవ భాగము



మొల్ల కవితాపటిమను విన్న రాయలు వారు ఆమెను భువనవిజయానికి ఆహ్వానించారు. అష్టదిగ్గజ కవుల సమక్షంలో ఆమె రాయలవారికి తను రచించిన రామాయణంలోని పద్యాలు చదివి వినిపించింది.కానీ సభలో వారు మొల్ల ఆశుకవితా సామర్ధ్యాన్ని పరిక్షించాలనుకున్నారు.
 ఇంకేముంది! రామలింగడు," గుమ్ము,బుస్సు,రింగు,బొణుగు" అనే మాటలు వాడి  గజేంద్ర మోక్ష ఘట్టాన్ని చెప్పమన్నారు.ఇంకా, విష్ణువు దూరము నుండే గజరాజునకు ధైర్యము చెప్పి, అభయం పలికినట్లు పద్యము లో ఒక్కసారే ఉండాలి.ఈ నియమాలు పాటిస్తూ మొల్ల చక్కటి ఈ పద్యాన్ని చెప్పింది:

అనిలాభిహత దక్షిణా వర్త శంఖంబు గుంఫి తంబై కేలగుమ్ము రనగ 
గొడుగై తరచుగ బడగలొక్కెడదట్టి భుజగాధిపతి మీద బుస్సరనగ  
చఱచి నిబ్బరముగా బఱతెంచు ఖగరాజు ఱెక్కగాడ్పులు మింట ఱింగు రనగ
దొంతి బ్రహ్మాండపంక్తులు బొజ్జలోనుండి బెణకియొక్కొకమాఱు బొణుగు రనగ
                                                                -అనుకరణమున రేఫాగమము
 కూకకనుచూపుమేరకు గోకవిసరి వెఱకు!వెఱవకు! వెఱవ!కనుచు
నుద్దవడివచ్చి గజరాజునొద్దవ్రాలె నార్తరక్షణచణుడు నారాయణుండు. 
  
అత్యంత మనోహరమైన ఈ పద్యం విన్నవారంతా మొల్లను మెచ్చుకున్నారు.ఈ విధంగా మొల్ల రాయలవారినీ, ఆతని అష్టదిగ్గజ కవులని కూడా మెప్పించింది.  
                                                               
                                                                సమాప్తం

29.1.13

మొల్ల(కవుల కధలు)


మొల్ల, పేరుతో సినిమా కూడా తీశారు కాబట్టి చాలా మందికి ఇది ఒక కవయిత్రి పేరు అని తెలిసే అవకాశం ఉందనుకుంటున్నా! ( ఇది మా తరం వారిని ఉద్దేశ్యించి అంటున్నను గానీ పెద్దవారిని కాదండోయ్!) రామాయణాన్ని ఎంతో మంది కవులు రచించినా, మొల్ల రామాయణానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి
మొదటిగా, ఒక స్త్రీ కవిత్వం చెప్పటం, అందులోనూ అది రామాయణం కావటం.
రెండు, అంతకు మునుపు ఉన్న ఎన్నో రామయణ కావ్యాల్లో లేని చమత్కారం మొల్ల రామయణం లో ప్రస్ఫుటంగా కనిపించడం.
మూడు,కేవలం 900 గద్యపద్యాల్లో రామాయణాన్ని పూర్తి చేయటం. వాల్మికి  మొదలగు వారు రాసిన రామాయణం కన్నా క్లుప్తంగా ఉన్నా, భావం లో  లోతూ, చమత్కారం, సరళతా కనబడుతాయి. ఇదే విషయం మీకు తెలియాలంటే పద్యం చదవండి:
   "సుడిగొని రాముపాదములు సోకిన ధూళి వహించి రాయియే
   ర్పడ నొకకాంతయయ్యెనట! పన్నుగ నీతని పాదరేణు వి
   య్యెడవడినోడ సోకనిది యెట్లగునోయని సంశయాత్ముడై
   కడిగె గుహుండు రాము పద కుంజయుగంబు భయంబు పెంపునన్."
శ్రీ రాముని పాదధూళి తాకి, రాయి ఒక స్త్రీ గా మారినదట!(అహల్య). అటువంటి ఇతడు నా ఓడలో కాలు మోపితే ఏమవుతుందో అని భయపడిన గుహుడు, ఓడ ఎక్కే ముందు రాముని పాదాలను కడిగాడని  మొల్ల చమత్కరించింది. .మొల్ల ఊహ బాగుంది కదా! ఇదే ఊహను, బాపు తన సంపూర్ణ రామాయణం సినిమా లో బాగా చిత్రీకరించారు.
పై పద్యం భావ చమత్కారం చూబెడితే,పదాలకట్టులోని చమత్కారాన్ని పద్యం చూపుతుంది:
 "రఘువరుడిచ్చిన ముద్రిక రఘువల్లభుదేవికిచ్చి రభసంబున నా
 రఘువరునకానవాలుగ రఘువల్లభుదేవి చేతి రత్నము గొంటిన్"
సీతాదేవికి రాముని ఉంగరాన్నిచ్చి,ఆమె గురుతుగా రాముని కోసం ఆమె దగ్గరనుండి ఒక రత్నాన్ని(చూడామణి)తీసుకున్నాను అని హనుమంతుడు అంటున్నాడు. కార్యము చక్కబెట్టడానికి రభసయిందని(లంకాదహనం) కూడా చెబుతున్నాడు. రఘు,రభస,రత్నము శబ్దాలను వ్రుత్యానుప్రాస అలంకార పద్ధతిలో మొల్ల అందంగా వాడినది. ఇటువంటి అనేక పదప్రయోగాలను మొల్ల రామాయణంలో చూడొచ్చు
మొల్లది ఇంకొక్క పద్యం రాస్తాను, ఇది నాకు చాలా నచ్చింది,
ఉన్నాడు లెస్స రాఘవు
 డున్నాడిదెకపుల గూడి యురుగతిరానై
 యున్నాడు నిన్ను గొనిపో
 నున్నాడిది నిజము నమ్ము ముర్వీతనయా!"
పద్యంలో హనుమంతుడు సీతతో, రాముడు బాగానే ఉన్నాడు, మా వానరులతో కలిసున్నాడు, నిన్ను నిజంగా తీసుకెళ్తాడు నన్ను నమ్ము! అని చెబుతున్నాడు.ఉన్నాడు అనే మాటతో అద్భుతంగా ప్రాస వాడి, ఇంత సులభమైన పద్యానికి కూడా మొల్ల ఎంతో అందాన్ని తెచ్చింది. ఇవి కొన్ని మాత్రమే! నాకు ఇంకా చాలా పద్యాలని ప్రస్తావించాలని ఉన్నా, ఇక్కడితో ఆపుతున్నా!
 మొల్ల గురించి మరిన్ని విషయాలు ఇంకో వ్యాసంగా రాస్తాను. ఇక సెలవు

13.1.13

సంక్రాంతి శుభాకాంక్షలు!



అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు! సంక్రాంతి కబుర్లేవీ లేవు. ఇంతకు ముందు ముగ్గులూ, బొమ్మల కొలువులని ఏదో ఒక పనుండేది. ఈ ఏడు మేము ఇల్ల్లు వదిలేసి అపార్టుమెంటు లోకి వచ్చేశాం. అందుకని పండుగని ఇల్లు కడక్కోవడానికి కూడా లేదు. ఫిండి వంటలు మాత్రం బాగా చేశాను, మా అమ్మతో కలిసి! సున్నుండలూ, కజ్జికాయలూ, గవ్వలూ, జంతికలూ! ఇంకా...! కవుల కధలు నా తెలుగు తీరాలుకు చేర్చాలనుకున్నా, వీలు చిక్కట్లేదు. ఈసారి తప్పకుండా ఒక మంచి కవి గురించి ప్రస్తావిస్తాను. ఇహ సెలవు మరి!   

26.12.12

తెలుగుజాతి మనది

తెలుగు మహాసభల పుణ్యాన తెలుగు వార్తాపత్రికల్లో తెలుగు భాష గురించి రాస్తున్నారు. లేకపోతే వాళ్ళకు మాత్రమేం ఖర్మ! తెలుగు మహా సభలు జరగడం తెలంగాణకు అన్యాయ అనడం నవ్వొస్తోంది! తెలంగాణ వాళ్ళు మాట్లాడేది కూడా తెలుగే కదా! అయితే వారిది తెలంగాణ మాండలికంగా పిలుస్తారు.ఇక పొతే గద్దర్ వంటి తెలంగాణ కవులకి స్థానం కల్పించడం విషయమైతే, ప్రస్తుతం రగులుతున్న తెలంగాణ పోరాట నేపధ్యం లో పోరాటాన్నీ,భాషోద్యమాన్నీ వేరు చేసి చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. గద్దర్ వంటి వారు కవుల కంటే కూడా ఉద్యమకారులుగా గుర్తింపు పొందారు! కాబట్టి ఇటువంటి విషయాలను పెద్దవి చేయడం అనవసరం. ఆ మాటకోస్తే, తెలుగు వారికి మొట్టమొదటి  జ్ఞానపీఠ్ పురస్కారం సాధించి పెట్టిన విశ్వనాథ సత్యనారయణ గారికి, ఆయన  సాహిత్యసంపదకే ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వట్లేదు. దాన్ని పట్టించుకునే నాధుడేడి? ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగే వాడాలి అంటున్నరు, దాని వల్ల ఎవరికి ఉపయోగం? రకరకాల వారు ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల మీద వస్తారు, తెలుగు రాని వారు ఉండచ్చు. వారికెంత ఇబ్బంది? తెలుగు భాషను అందరూ నేర్చుకునే చర్యలూ, తెలుగు  సాహితీ ప్రక్రియలకు ప్రాచుర్యం కల్పిస్తే చాలదా!తెలుగు భాషను కోస్తా, సీమ, తెలంగాణ మాండలికాల్లో, ఎలా మాట్లాడే వారైనా మాత్రుభాషను ప్రేమించండి, తరువాతి తరాలకు నేర్పించండి.   మనది తెలుగుజాతని గర్వపడండి.
    
   

19.7.12

బావ-బావమరుదుల సరసాలు( కవుల కధలు )

మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు దాదాపు అందరికీ పోతన, శ్రీనాథ కవుల పద్యాలూ, వారి మధ్య విభేదాలు చెప్పే కధలు తెలుసు.కానీ మా తరం వారికి పెద్దగా ఇటువంటివి తెలియవు. అందుకోసమే ఈ సంఘటన బ్లాగుతున్నా. అదే కాక కవుల కధలు అని ప్రత్యేకంగా కూటమి మొదలెడుతున్నా. నాకు తెలిసిన కవుల చరిత్ర గురించి ఇందులో ప్రస్తావించాలని నా ఆరాటం. ముందుగా పోతన- శ్రీనథుల బావ-బావమరుదుల సరసాలు.....  

 శ్రీనాథ కవి పల్లకి లో వెడుతుండగా పోతనకు తన మహాత్మ్యము చూపగోరి పల్లకి బోయీలను తొలగిపొమ్మన్నారుట. బోయీలు లేకున్నా పల్లకి గాలిలో తేలుతూ వెళ్తోంది.ఆ వింత చూసి పోతన నాగలి కాడికి గట్టిన ఎద్దులను తొలగించారు.ఎద్దులు లేకుండానే నాగలి పొలమును దున్నుతోంది. ఆ ద్రుశ్యము చూసి శ్రీనాథుడు పల్లకి దిగివచ్చి పోతనతో " హాలికులకు సేమమా?" అని పరిహాసమాడారు. వెంటనే పోతన ..
" బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్
  గూళలకిచ్చి యప్పడుపు(గూడు భుజించుటకంటె సత్కవుల్
  హాలికులైన నేమి? గహనాంతర సీమల( గందమూలకౌ
  ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై"
అంటూ కావ్యకన్యను అమ్ముకుని తినడం కంటే నిజమైన కవి హాలికుడైననూ తప్పులేదని శ్రీనాధునకు ఘాటుగా సమాధానమిచ్చారు.కానీ తరువాత తన బావ శ్రీనధుని పరివారానికి సరైన ఆతిధ్యము ఇవ్వలేక భాగవతమును ఏ రాజుకో అంకితమిచ్చుండవలసినదని పోతన అనుకున్నారట. వెంటనే సరస్వతీదేవి ప్రత్యక్షమయ్యి కన్నీరు కార్చినదట! అప్పుడు పోతన...
"కాటుక కంటినీరు చనుకట్టు పయింబడనేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాటకగర్భు రాణి! నిను నా(కటికిం గొనిపోయి యల్ల క
ర్ణాటకిరాట కీచకుల కమ్మ(, ద్రిశుద్ధిగ నమ్ము భారతీ!" అని పలికి దేవినోదార్చెనట.
ఆ దేవి కరుణ వలన ఆతిధ్యమునకు కావలసినవన్నీ సమకూరాయట.

భోజనానంతరం శ్రీనాథుని కోరికపై పోతన తాను వ్రాయుచున్న భాగవతమునందలి గజేంద్ర మోక్షము చదివి వినిపించెను. అందు
"సిరికిం జెప్ప(డు, శంఖచక్రయుగముం జేదోయి సంధింప(డే
పరివారంబును జీర(, డభ్రగపతిం బన్నింప(, డాకర్ణికాం
తరధమ్మిల్లము( జక్కనొత్త(డు, వివాదప్రోత్ధితశ్రీకుచో
పరిచేలాంచలమునైన వీడ(డు గజప్రాణావనోత్సాహియై"
అని చదవగానే శ్రీనాథుడు నవ్వి, "బావా! ఎవ్వరికీ చెప్పక, ఏ పరివారమును వెంట తీసుకునిపోక,ఏ సాధనములూ చేపట్టక విష్ణుమూర్తి గజేంద్రుడను ఎలా రక్షిద్దామని వె ళ్ళా డు!" అని వెక్కిరించెను. పోతన నవ్వి ఊరుకుండెను.
కొద్దిసేపటికి శ్రీనాథుని కొడుకు బావిలో పడ్డాడన్న  వార్త వచ్చింది. ఒక్క పరుగున శ్రీనాథుడు బావి దగ్గరకి వెళ్ళి అరవడం మొదలెట్టెనట! పోతన, అతని కొడుకు మల్లన అక్కడికి వచ్చి " బావా! ఎవ్వరికీ చెప్పక,ఏ సాధనములూ తీసుకునిరాక బావిలో పడిన కొడుకును ఎట్లు రక్షిద్దామనుకుంటివి?" అని ప్రశ్నించెను. అతని మాటలకు
 శ్రీనాథుడు తెల్లబోయెను. మల్లన " నీ కొడుకు క్షేమమే మామా !" అంటూ పిల్లవాడిని  చాటునుండి తీసుకొచ్చెనట! అప్పుడు పోతన " బావా! నాడు శ్రీహరి కూడా గజేంద్రుడను రక్షించుటకు ఇదే ఆరాటాన్ని పొందియుండును. తెలిసినదా?" అని అన్నారు.శ్రీనాథుడు పోతన యొక్క అలౌకిక కవితావిశేషమును తెలుసుకుని క్షమార్పణ కోరెను.
గుణపాఠాలు చెప్పుటకు హాలికులైననేమి అన్నట్టు ఉంది కదా ఈ కథ!



1.7.12

గురువుగారి పాటలు- అన్నమయ్య పాఠాలు

కొన్ని నెలలుగా నేను రాజమండ్రి లో పుట్టిన అసలుసిసలైన తెలుగమ్మాయిగా బతికేస్తున్నాను. సినిమాలు, షికారులు, హడావుడి, గజిబిజి గందరగోళం నుండి బయటపడి సంగీతం, సాహిత్యం, వంట-వార్పు అంటూ హాయిగా మా అమ్మతో ఆనందంగా ఉన్నాను.మా కొత్తింటి పనులు కూడా నెమ్మదిగా అవుతున్నాయి.ఏదో ఈనాడు ఆదివారం అనుబంధం వాడు రాసినట్టు గానే నా రాశి ఫలాలు జరగబట్టి మధ్యమధ్యలో పెళ్ళీ-పేరంటం; విందు-వినోదం అని అందరినీ కలుస్తున్నాను. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది విజయవాడ లో మా సంగీతం గురువుగారి గురించి. చిన్నప్పుడు నేను బాలమ్మ గారి దగ్గర వర్ణాల దాకా సంగీతం నేర్చుకున్నా. మళ్ళీ దాదాపు పన్నెండేళ్ళ తరువాత బాలమ్మ గారి స్నేహితురాలైన ప్రభాకర రామలక్ష్మి గారి దగ్గర సంగీత పాఠాల కోసం వెళ్ళడం మొదలు పెట్టాను. వాళ్ళింటికి వెళ్ళేసరికి ఆవిడ  టి.టి.డి చానలు పెట్టుకుని అందులో ప్రసారమయ్యే అన్నమయ్య కీర్తనలు ప్రతి రోజూ విని, స్వరం రాసిపెట్టుకుని మరీ  నాకు పాడి వినిపించే వారు.నాకేమో మొదటి నుంచీ అన్నమయ్య అంటే పెద్దగా ఇష్టం లేదు.నాకు భాషా జ్ఞానం ఎలా వచ్చిందో తెలియదు గానీ, చిన్నప్పటి నుంచే అన్నమయ్య శ్రుంగార కీర్తనలను వ్యతిరేకించేదాన్ని. పైత్యం ఎక్కువయ్యి పాటలు రాశాడు గానీ గొప్ప భక్తుడేమీ కాదని ఒకప్పటి నా భావన. గురువు గారేమో ఖచ్చితంగా రోజూ ఒక అన్నమయ్య కీర్తన పాడించందే వదిలి పెట్టరు!ఈ అన్నమయ్య నన్నిలా పట్టుకున్నాడేoటి రా బాబోయ్! అని నేను ఎన్నో సార్లు ఆలోచించినా, పాట పాడటం మొదలెట్టాకా ఆపకుండా పాడేదాని. ఒక్కో కీర్తన పాడుతుంటే వచ్చే అనందం నేను చెప్పలేను. రాయలేను కూడా!  ఈ అన్నమయ్య పాటలు నాకెందుకు నచ్చుతున్నై, వీటిలిని ఏ రకంగా  అర్ధం చేసుకోవాలని నేను అనుకున్న కొద్దిసేపటికే నా మనసుకు ఇలా తోచింది: మా తరానికి శ్రుంగారం వంటి విషయాల మీద భారత వేదధర్మ  సాంప్రదాయేతరాభిప్రాయాలు బలంగా ఉన్నాయి. భారత సంప్రదాయం ప్రకారం శ్రుంగారనికి కళత్ర ధర్మం, పవిత్రత, పిత్రు దేవతల ఆశీర్వచనములూ ఆపాదించబడినవి. శ్రుంగార కీర్తనా స్తుతి ద్వారా అన్నమయ్య అటువంటి భావనలకు ఒక   దైవత్వాన్నీ, పవిత్రతనీ ఆపాదించాడు.స్వామి వారిని కీర్తించాడనడం కంటే  భావి తరాలకి ఒక నిక్షిప్త  సందేశం అందించాడు అన్నమయ్య. ప్రతీ విషయంలో ఉన్న మంచిని చూడడానికి ప్రయత్నిస్తే, దానిలోని లోతునూ, నిగూఢార్ధాలను మనంతట మనమే నేర్చుకోగలమనిపిస్తోంది!   

18.3.12

1892వ సంవత్సరపు కోలవెరి!


చాలా రోజుల నుండీ ఈ విషయం బ్లాగుదామంటే వీలు చిక్కటం లేదు. ఈ కింది వాక్యాలను చదవండి:
నీ సైటు నాడి లైటు;నిన్ను మిన్న
కానకున్న
క్వైటు రెచడ్ ప్లైటు .................
మూను లేని నైటు
ఫుల్లుమూను లైటటా,
మూనుకన్న
మొల్ల కన్న
నీదు మోము బ్రైటట,
టా!టా!టా!


ఇది గిరీశం మధురవాణి కోసం పాడుకున్న కోలవెర్రి పాట!(కోలవెరి,ఈ మధ్యకాలంలో బాగా ఆదరణ పొందిన పాట. దీని సాహిత్యం ఇక్కడ నేను ప్రస్తావించిన వాక్యాలను చాలా వరకూ పోలి ఉంటుంది.) కన్యాశుల్కం నాటకంలో గురజాడ ఈ పాటను గిరీశం చేత 1892 లోనే పాడించారు. ఆ కాలంలో తెలుగు నాటకానికి జీవం పోసిన గొప్ప సంస్కరణా భావలను వ్యంగ్యం తో నడిపించిన హాస్య రస ప్రధాన నాటకం కన్యాశుల్కం.హాస్యం పండించడానికి గిరీశం ఆంగ్లంలో పలికే సంభాషణలు మహా చతురంగా ఉంటాయి.అలాంటి ఒక సందర్భంలో వచ్చేదే ఈ పాత కోలవెరి! నేను కన్యాశుల్కం బాగా చదివానని ఒప్పుకుంటారుగా!

29.12.11

మా గోదావరి

కోనసీమ కళ్ళారా చూసిన తరువాత గానీ తెలియలేదు అందరూ ఎందుకు అంత పొగుడుతారో. ఎటు చూసినా గోదావరి నది, రోడ్డుకు ఇరువైపులా పంటకాల్వలూ, ఇళ్ళలోంచి బయటకు రావాలంటే కాలువ దాటి రోడ్డు మీదకి రావలి.భలే అనిపించింది! దాదాపు అన్ని ఇళ్ళ మీద నుంచీ గుమ్మడి కాయలూ, కాకరకాయలూ హలో చెబుతున్నాయి. ఇక కొబ్బరి చెట్లు, కలువ పూవులు, మెట్ట తామరల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోనసీమంటేనే కొబ్బరి కదా!ఇక గోదావరి సముద్రం లో కలిసేది కోనసీమ చివరాఖరనున్న అంతర్వేదిలో.నాకైతే అసలక్కడ నుంచి రావాలనిపించ లేదు. ఎంత బాగుందో గోదావరి సముద్రంలో కలవడం చూస్తుంటే!
విశ్వనాథ పలుకై...అది విరుల తేనె చినుకై ..కూనలమ్మ కులుకై..అది కూచిపూడి నడకై..
పచ్చని చేల పావడ గట్టీ..కొండమల్లెలే కొప్పున బెట్టీ..వచ్చే దొరసాని..మా వన్నెల కిన్నెరసాని......

వేటూరి వారు గోదావరి అందాలను ఎంతగా పొగిడినా చాలలేదనిపిస్తోంది.ఆయన వర్ణించినట్టు విశ్వనాథ వారి రచనంత గంభీరం గా, కూచిపూడి నాట్యమంత అందంగా ఉంది నదీప్రవాహం.నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది దేవులపల్లి వారు అంత చక్కటి కవితలెట్లా రాయగలిగారో! మా గోదావరి పాడి-పంటలకే కాదు,సంగీత-సాహిత్యాలకూ నెలవు.