అనుచరులు

29.8.11

మన భాషను బ్రతికిద్దాం!

గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినమైన ఈ రోజు , వారు తెలుగు భాష కు అందించిన సేవలను గౌరవిస్తూ మనందరం తెలుగు మాత్రు భాషా దినోత్సవం గా జరుపుకుంటూ వున్నాం. వాడుక భాషకూ, కావ్య భాష కూ ఉన్న వ్యత్యాసం చేత విద్యార్ధులు శ్రమ పడుతున్నారనే విషయం వలన మొదలైన జీవద్భాషోద్యమం క్రమం గా తెలుగు భాషోద్యమమైనది. ఈ క్రమం లో తెలుగు విద్యాభ్యాసం లో వచ్చిన ఎన్నో మార్పులు, తెలుగు చదవడం కష్టమనే ప్రధ కొంత వరకూ తొలగించినాయి. అయితే, ఈ నాడు తెలుగు భాష పరిస్థితి ఏమిటి? ఎంతమంది పిల్లలు అమ్మా....నాన్నా, అని పిలుస్తున్నారు? ఆంగ్ల భాష లో మాటాడితేనే నాగరికత అన్న ద్రుష్టి అందరిలో నాటుకు పోయినది.క,ఖ; న, ణ;అక్షరాలను సరిగ్గా ముప్పై ఏళ్ళ వాళ్ళే పలుక లేకపోతున్నారు.ఇక పిల్లలకేమి నేర్పుతారు? గణనాధుడుఅన్న మాట చిన్న పిల్లల చేత అనిపించలేక పోతున్నా...ఎన్ని సార్లు చెప్పినా గననాదుడు!! తెలుగు కు పట్టిన తెగులు ఇలా ఉంది. పెద్దపెద్ద నగరాల్లో ఇలా ఉంది, మన పల్లెల వైపుకు వెడితే ఇంకా తెలుగు బ్రతికే ఉంది అని అనుకుంటే పొరబాటే! ఆ కొద్ది పాటి ఆశా మన ఘనత వహించిన సినిమాలు చంపేస్తున్నై.ఆ మధ్యన ఏదో తెలుగు సినిమా లో కల కీ, కళ కీ తేడా లేకుండా సంభాషణలు చెప్పాడు ఒక ప్రముఖ నాయకుడు. అలాగే పెళ్ళి అనే మాటను పెల్లి అంటున్నారు! ఇలా ఉంది మన తెలుగు . అంతర్జాతీయ నివేదికలు, అంతరించి పోతున్న భాషల జాబితాలో తెలుగు ను చేర్చినా, మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఏడాదికొక సారి , ఈ రోజు తెలుగు దినోత్సవం నామ మాత్రం గా జరిపేసి చేతులు దులిపేసుకుంటోంది. భాష ను ఆధారం గా చేసుకుని ఏర్పడిన రాష్ట్రం గా మన తెలుగు వారు గుర్తింపబడినా మన భాష పరిస్థితి ఇలా ఉంది!! తెలుగు భాష ఉద్ధరింపబడాలని మనసారా కోరుకుంటూ..జై తెలుగు తల్లి..జై తెలుగు తల్లి...జై తెలుగు తల్లి!