అనుచరులు

29.8.13

అసమర్థుని జీవయాత్ర

చాలా రోజుల తరువాత తెలుగు నవల చదవాలనిపించి, పుస్తకం కోసం వెతుకుతుంటే అసమర్థుని జీవయాత్ర అనే ఈ నవల గురించి తెలిసింది.త్రిపురనేని గోపీచంద్ రాసిందీ నవల.ఈ పుస్తకం చదివాకా నాకు పుట్టుకొచ్చిన చిరాకు అంతా ఇంతా కాదు!ఈ కధాంశం నుండి పాఠకులేం తెలుసుకోవాలని రచయిత కోరుకున్నాడో నాకర్ధం కాలేదు.సీతారామారావు ఈ నవలలో కధానాయకుడు! కాదు కాదు కధానయకుడనడానికి లేదు, ముఖ్య పాత్ర!
వీడంత వెధవ ఇంకోడు ఈ భూమి మీద ఎక్కడా పుట్టి ఉండడు,పుట్టడు (కనీసం ఊహల్లో కూడా పుట్టడు!)అని మొదటి నాలుగైదు కాగితాలు తిరగేస్తేనే అర్థమైపోతుంది.వీడికి మనుషులు నచ్చరు,కుటుంబ వ్యవస్థ నచ్చదు,తల్లిదండ్రులు,అత్తమామలు,భార్యాబిడ్డలు,ఇలా ఏ మానవసంబంధాలూ ఇష్టముండవు.వీడికి పెళ్ళి వద్దట!కానీ ఇంట్లో వాళ్ళను కాదనలేక పెళ్ళాడతాడు.మరి ఇంత పెళ్ళి ఇష్టం లేని వాడూ పెళ్ళం తోనే ఉంటాడు, పిల్లల్ని కంటాడు. కానీ వీడికి ఎవరన్నా ఇష్టం లేదు!వాడి నిరాశానిస్ప్రుహల్లో వాడుంటాడు, చివరికి చాలా క్రూరంగా ఆత్మహత్య చేసుకుని చస్తాడు.అదీ స్మశానంలో ఆత్మహత్య!

అసమర్థులూ,నిరాశావాదులూ,తమ ఈ అశక్తతను అధగమించడం ఎలాగో చెప్పడం మానేసి,ఒక విషాదభరిత,విషపూరిత కధాంశాన్ని పాఠకులకు అందించడంలో రచయిత ఉద్దేశ్యం ఏమిటో??  

4.7.13

మొల్ల (కవులకధలు)-రెండవ భాగము



మొల్ల కవితాపటిమను విన్న రాయలు వారు ఆమెను భువనవిజయానికి ఆహ్వానించారు. అష్టదిగ్గజ కవుల సమక్షంలో ఆమె రాయలవారికి తను రచించిన రామాయణంలోని పద్యాలు చదివి వినిపించింది.కానీ సభలో వారు మొల్ల ఆశుకవితా సామర్ధ్యాన్ని పరిక్షించాలనుకున్నారు.
 ఇంకేముంది! రామలింగడు," గుమ్ము,బుస్సు,రింగు,బొణుగు" అనే మాటలు వాడి  గజేంద్ర మోక్ష ఘట్టాన్ని చెప్పమన్నారు.ఇంకా, విష్ణువు దూరము నుండే గజరాజునకు ధైర్యము చెప్పి, అభయం పలికినట్లు పద్యము లో ఒక్కసారే ఉండాలి.ఈ నియమాలు పాటిస్తూ మొల్ల చక్కటి ఈ పద్యాన్ని చెప్పింది:

అనిలాభిహత దక్షిణా వర్త శంఖంబు గుంఫి తంబై కేలగుమ్ము రనగ 
గొడుగై తరచుగ బడగలొక్కెడదట్టి భుజగాధిపతి మీద బుస్సరనగ  
చఱచి నిబ్బరముగా బఱతెంచు ఖగరాజు ఱెక్కగాడ్పులు మింట ఱింగు రనగ
దొంతి బ్రహ్మాండపంక్తులు బొజ్జలోనుండి బెణకియొక్కొకమాఱు బొణుగు రనగ
                                                                -అనుకరణమున రేఫాగమము
 కూకకనుచూపుమేరకు గోకవిసరి వెఱకు!వెఱవకు! వెఱవ!కనుచు
నుద్దవడివచ్చి గజరాజునొద్దవ్రాలె నార్తరక్షణచణుడు నారాయణుండు. 
  
అత్యంత మనోహరమైన ఈ పద్యం విన్నవారంతా మొల్లను మెచ్చుకున్నారు.ఈ విధంగా మొల్ల రాయలవారినీ, ఆతని అష్టదిగ్గజ కవులని కూడా మెప్పించింది.  
                                                               
                                                                సమాప్తం

29.1.13

మొల్ల(కవుల కధలు)


మొల్ల, పేరుతో సినిమా కూడా తీశారు కాబట్టి చాలా మందికి ఇది ఒక కవయిత్రి పేరు అని తెలిసే అవకాశం ఉందనుకుంటున్నా! ( ఇది మా తరం వారిని ఉద్దేశ్యించి అంటున్నను గానీ పెద్దవారిని కాదండోయ్!) రామాయణాన్ని ఎంతో మంది కవులు రచించినా, మొల్ల రామాయణానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి
మొదటిగా, ఒక స్త్రీ కవిత్వం చెప్పటం, అందులోనూ అది రామాయణం కావటం.
రెండు, అంతకు మునుపు ఉన్న ఎన్నో రామయణ కావ్యాల్లో లేని చమత్కారం మొల్ల రామయణం లో ప్రస్ఫుటంగా కనిపించడం.
మూడు,కేవలం 900 గద్యపద్యాల్లో రామాయణాన్ని పూర్తి చేయటం. వాల్మికి  మొదలగు వారు రాసిన రామాయణం కన్నా క్లుప్తంగా ఉన్నా, భావం లో  లోతూ, చమత్కారం, సరళతా కనబడుతాయి. ఇదే విషయం మీకు తెలియాలంటే పద్యం చదవండి:
   "సుడిగొని రాముపాదములు సోకిన ధూళి వహించి రాయియే
   ర్పడ నొకకాంతయయ్యెనట! పన్నుగ నీతని పాదరేణు వి
   య్యెడవడినోడ సోకనిది యెట్లగునోయని సంశయాత్ముడై
   కడిగె గుహుండు రాము పద కుంజయుగంబు భయంబు పెంపునన్."
శ్రీ రాముని పాదధూళి తాకి, రాయి ఒక స్త్రీ గా మారినదట!(అహల్య). అటువంటి ఇతడు నా ఓడలో కాలు మోపితే ఏమవుతుందో అని భయపడిన గుహుడు, ఓడ ఎక్కే ముందు రాముని పాదాలను కడిగాడని  మొల్ల చమత్కరించింది. .మొల్ల ఊహ బాగుంది కదా! ఇదే ఊహను, బాపు తన సంపూర్ణ రామాయణం సినిమా లో బాగా చిత్రీకరించారు.
పై పద్యం భావ చమత్కారం చూబెడితే,పదాలకట్టులోని చమత్కారాన్ని పద్యం చూపుతుంది:
 "రఘువరుడిచ్చిన ముద్రిక రఘువల్లభుదేవికిచ్చి రభసంబున నా
 రఘువరునకానవాలుగ రఘువల్లభుదేవి చేతి రత్నము గొంటిన్"
సీతాదేవికి రాముని ఉంగరాన్నిచ్చి,ఆమె గురుతుగా రాముని కోసం ఆమె దగ్గరనుండి ఒక రత్నాన్ని(చూడామణి)తీసుకున్నాను అని హనుమంతుడు అంటున్నాడు. కార్యము చక్కబెట్టడానికి రభసయిందని(లంకాదహనం) కూడా చెబుతున్నాడు. రఘు,రభస,రత్నము శబ్దాలను వ్రుత్యానుప్రాస అలంకార పద్ధతిలో మొల్ల అందంగా వాడినది. ఇటువంటి అనేక పదప్రయోగాలను మొల్ల రామాయణంలో చూడొచ్చు
మొల్లది ఇంకొక్క పద్యం రాస్తాను, ఇది నాకు చాలా నచ్చింది,
ఉన్నాడు లెస్స రాఘవు
 డున్నాడిదెకపుల గూడి యురుగతిరానై
 యున్నాడు నిన్ను గొనిపో
 నున్నాడిది నిజము నమ్ము ముర్వీతనయా!"
పద్యంలో హనుమంతుడు సీతతో, రాముడు బాగానే ఉన్నాడు, మా వానరులతో కలిసున్నాడు, నిన్ను నిజంగా తీసుకెళ్తాడు నన్ను నమ్ము! అని చెబుతున్నాడు.ఉన్నాడు అనే మాటతో అద్భుతంగా ప్రాస వాడి, ఇంత సులభమైన పద్యానికి కూడా మొల్ల ఎంతో అందాన్ని తెచ్చింది. ఇవి కొన్ని మాత్రమే! నాకు ఇంకా చాలా పద్యాలని ప్రస్తావించాలని ఉన్నా, ఇక్కడితో ఆపుతున్నా!
 మొల్ల గురించి మరిన్ని విషయాలు ఇంకో వ్యాసంగా రాస్తాను. ఇక సెలవు

13.1.13

సంక్రాంతి శుభాకాంక్షలు!



అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు! సంక్రాంతి కబుర్లేవీ లేవు. ఇంతకు ముందు ముగ్గులూ, బొమ్మల కొలువులని ఏదో ఒక పనుండేది. ఈ ఏడు మేము ఇల్ల్లు వదిలేసి అపార్టుమెంటు లోకి వచ్చేశాం. అందుకని పండుగని ఇల్లు కడక్కోవడానికి కూడా లేదు. ఫిండి వంటలు మాత్రం బాగా చేశాను, మా అమ్మతో కలిసి! సున్నుండలూ, కజ్జికాయలూ, గవ్వలూ, జంతికలూ! ఇంకా...! కవుల కధలు నా తెలుగు తీరాలుకు చేర్చాలనుకున్నా, వీలు చిక్కట్లేదు. ఈసారి తప్పకుండా ఒక మంచి కవి గురించి ప్రస్తావిస్తాను. ఇహ సెలవు మరి!