అనుచరులు

23.9.10

కదంబం

చిన్నప్పుడు మా అమ్మ తో కలిసి, వాళ్ళ కళాశాల వార్షికోత్సవానికి ప్రతి ఏడూ వెళ్ళేదాన్ని. మా విజయవాడ లో తుమ్మలపల్లి కళాక్షేత్రమని పెద్ద హాలు ఉంది, అక్కడే ఈ కార్యక్రమాలన్నీ జరిగేవి. ఎప్పుడో సరిగ్గా గుర్తు లేదు గానీ, ఒక సారి అలా మా అమ్మ శిష్యులే ఒక న్రుత్య రూపకం ప్రదర్శించారు. అమ్మా, జానకి ఆంటీ పాడారు, వాళ్ళ ప్రధానోపాధ్యాయులు పుష్పవతి గారు రచన. అంటరానితనం ఉండకూడదని ఆ ప్రదర్శనలో ఒక్కొక్క పూవు చెపుతుంది. చాలా బాగుంటుంది. రంగు పూలన్నీ, గడ్డి పూవు ని వెలేస్తే, అది దేవుడి గుడి ముందు ఏడుస్తూ, అంటరాని దానిననీ, అంటుకో కూడదని ఆమడ దూరం తరిమి, తరిమి కొడతారు ...ఇలా సాగుతుంది. చాలా రోజులకు, పూవులు మాట్లాడుకోవడం అనే ఇతివ్రుత్తం తో, ఆ మధ్యన ఆగష్టు 15 కి, అందరూ కలిసి ఉండాలని, ఈ కదంబం కూర్చాను.

తోటన పెంచిన పూవులు అన్నీ
పై చేయికి పోటీ పడ్డవి !
గొప్పలు పల్కుతు సుమములు అన్నీ
తమ శ్రేష్టతను తెల్పుతున్నవి.

జాబిలి మరపించు జాజిని నేను
జాగు జేయక ముదితలు నను జడన ముడిచేరు
పూచినంతనే తావి విరజిమ్మెదను నేను
పూవులకు రారాణి నేను !

మనసులు మురిపించెడి మల్లెను నేను
ధవళ వర్ణమున సొగసులీనుతాను
మగువ మనసులు దోచి యేలేను నేను
పూరాణి కాక ఇంకేరు నేను !

గుండెన ప్రేమను నింపెడి గులాబి నేను
మదనుడి విరి శరమ్ము నేను
ప్రేమ సామ్రజ్యమ్ము యేలుదానను
నేనుగాక పూరాణి ఇంకెవ్వరగును !

పసుపు రంగున పూచె చామంతి నేను
వన్నె తగ్గక నేను వెలుగుతాను
పసిడి కాంతులు చిమ్ముదానను నేను
పూదోట పట్టపురాణి నేను !

ఇంతులు మెచ్చెడి బంతిని నేను
ఇంటికి స్వాగత మాలను నేను
ఇంతకు మించిన అర్హత ఏమది
పూవులనందున రాణిని నేను !

ముద్దుగుమ్మలకై పూచే ముద్దమందారాన్ను
ఎరుపుమురిపెములు పంచుతాను
ఏరికోరి నను తమదోటన పెంచేరు అందరు
నేనుండగ పూరాణి ఇంకెవ్వరగును !

ఊరిమి లేక పోరెను విరులు
ఊరట కోసం కోరెను తీర్పును
అంతట....

తరింపజేసెడి తులసిని నేను
తంపులు మాని తత్త్వం వినుడు
పూలగుమీరు మానుడి పోరు
గమనించండి మాలల తీరు.

ఏక వర్ణమున ఏదోయ్ అందం
ముచ్చట గొల్పును పూల కదంబం
కలసి ఉండుట స్రుష్టి ధర్మం
చాటుడి మీరు ఈ పరమార్ధం.

చెప్పిన మాటలు విన్నవి విరులు
చెట్టాపట్టల్వేసెను చెలులు!!!

10.9.10

వేయి పడగల విశ్వనాథుడు


గోవులు తెల్లన..గొపయ్య నల్లన..(సప్తపది) అనే పాట రచనకు వేటూరి వారికి స్పూర్తి విశ్వనాథ సత్యనారాయణ రచనే అని చాలా సార్లు చెప్పారు.వేటూరి పైన నాకున్న అభిమానం చేత విశ్వనాథ వారి రచన ఏదైనా చదవాలనుకున్నాను.అలా చదివినదే ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి మరియూ ఆంధ్ర విశ్వకళా పరిషద్పురస్కారాన్నందుకున్న "వేయి పడగలు".ఈ నవల 1920 ల కాలంలో మొదలయ్యి, స్వాతంత్ర్య పోరాట కాలం వరకూ సాగుతుంది.మొత్తం గ్రాంధిక భాష లో ఉంటుంది.ఈ తరం వారికి అర్ధం అవటం కష్టం.భారత దేశపు ఆత్మ అయిన భిన్నత్వం లో ఏకత్వం,ఏకత్వం లో భిన్నత్వం అన్నది ఏదైతే ఉందో,దానికి హైందవ ధర్మ శాస్త్రాన్ని జోడించి ఈ వేయి పడగలు కి పునాది వేశారు.కథా వస్తువు ఏదైనప్పటికీ ఈ పుస్తకం చదవటం వలన భాషాభివ్రుధి ఖాయం.మానవ సంబంధాల సున్నితత్వాన్ని,గాఢతను రామేశ్వర శస్త్రి భార్యల మధ్యా,సంతానం మధ్యనా చెబితే,భార్యా భర్తల బంధాన్ని ధర్మారావు-అరుంధతి పాత్రల ద్వారా చెప్పారు.వీటన్నిటికన్నా చిన్న జమిందారు-ధర్మారావు-గిరికల బంధం చిత్రమనిపిస్తుంది.పసిరిక పాత్ర ఒక వింత.ముఖ్యంగా నేను జమిందారీ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను.అలాగే స్నేహ బంధాలు బాగా చెప్పారు. ఆనాటి దేశ కాలధర్మ పరిస్థితి ఏమిటో,స్వధర్మాన్ని పరిత్యజించి పాశ్చాత్య నాగరికతానుసరణ వల్ల వచ్చే నష్టాలేమిటో,జమిందారు పాత్ర ద్వారా చెప్పబడింది.ఆధునికత మోజులో పడి, ప్రక్రుతి అందాలను మనం ఎలా కోల్పోతున్నామో చక్కగా వివరించారు.మురుగు నీరు సమస్యలూ,కంకర వల్ల వచ్చే అధిక వేడీ,వాతావరణం లో మార్పులూ కొన్ని పాత్రల ద్వారా చెప్పించారు విశ్వనాథ వారు.ఈ సమస్యలను మనం,ఈ కాలం పూర్తి స్థాయి లో అనుభవిస్తున్నాము.అన్నింటి కన్నా ముఖ్యంగా ధర్మా రావు పాత్ర చేత విశ్వనాథ వారు అనేకానేక సాహిత్య ప్రక్రియలను,వ్యాకరణాంశాలను మనకు పరిచయం చేయటం నాకు నచ్చిన అంశం. అంతే కాక గణాచారి పాత్ర కూడ బాగుంటుంది. కధలో మలుపు రాబోతున్న విషయం పాఠకులకు ఈ పాత్ర ద్వారా సూచించడం జరుగుతుంది. మూఢ నమ్మకాలకూ, సనాతన సాంప్రదాయాలకూ, అధునికతకూ, ఇలా అన్ని అంశాలకు ఈ వేయిపడగలలో స్థానం కల్పించారు రచయిత. ఈ పుస్తకం గురించి చెప్పుకుంటూ పోతే, అదే రాసుకుంటూ పోతే పడగకో కాగితం చప్పున నేను వేయి కాగితాలు రాయాల్సొస్తుంది. అందుకే ఇక చాలు. విశ్వనాథ సత్యనారాయణ గారి "రామాయణ కల్పవ్రుక్షము" తెలుగు వారి ఇంటికి జ్ఞాన పీఠ పురస్కారాన్ని తీసుకొచ్చింది. ఇంతకీ ఇప్పుడు "వేయి పడగలు" ఎందుకు తలచుకున్నానో రాయాలిగా...ఈ రోజు విశ్వనాథ సత్యనారాయణ గారి పుట్టిన రోజు!

1.9.10

మన తెలుగు... మన గిడుగు


తెలుగు భాషకు సేవలందించిన మహానుభావులు ఎందరో...ముందుగా వారందరికి నా వందనాలు. ఒక వారం పది రోజుల నుంచీ ఒంట్లో నలతగా ఉండటం వలన మిమ్మల్ని కలవలేక పోయాను. సరిగ్గా ఈలోపే మన మాత్రుభాషా దినోత్సవం కూడా అయిపోయింది. 29వ తేదీన వ్రాయదలచింది ఇప్పుడు రాస్తున్నాగా..
ఆది కవి నన్నయ, విశిష్ఠ శబ్ద ప్రయోగముల చేత శబ్ద శాసనుడిగా బిరుదు పొందినా, శ్రీనాథుడు ప్రబంధ కవితలతో కవి సార్వభౌముడైనా, కాలాంతరంలో వీరి రచనలు పామర రంజకాలు కాలేక పోయాయి. పర దేశీయుల పాలనలో మనం ఉన్నప్పటికీ, కొందరు ఆంగ్లేయులు తెలుగు భాష మీద మక్కువ పెంచుకున్నవారు లేకపోలేరు. వ్యవహార భాషకూ, గ్రాంధికానికి ఉన్న తేడాను సామాన్య ప్రజలు పెద్దగా ఎత్తి చూపకపోయినా, ఈ దొరలు మాత్రం భాషాంతరాన్ని ప్రశ్నించారు. ఈ వరుసలో వ్యవహార భాషొద్యమానికి బీజం వేసిన వానిగా జె. ఎ. ఏట్స్ దొరని చెప్పుకోవాలి. దొర గారి ప్రశ్నకు సమాధానంగా గురజాడ, గిడుగు, పి.టి. శ్రీనివాస అయ్యంగార్ల త్రయం శిష్ట వ్యవహారిక భాషను బోధనాంశాలకు మాధ్యమంగా వాడాలని వ్యవహార భాషొద్యమానికి తెర తీశారు. అయితే గిడుగు రామమూర్తి పంతులు ఉద్యమాన్ని ప్రజలకూ, ప్రభుత్వానికి దగ్గరగా తీసుకెళ్ళారు. ఈ క్రమంలో తెలుగు అనే మాస పత్రికను కూడా నడిపారు. కేవలం తెలుగుకే కాక సవర అనే కొండ తెగ భాషకు విశిష్ఠ సేవలందించి, రావు బహదూర్ బిరుదు పొందారు గిడుగు వారు. వ్యవహార భాష కు ఇంతగా క్రుషి చేసిన గిడుగు వారి జన్మదినమైన 29.ఆగష్టున తెలుగు మాత్రుభాషా దినోత్సవం గా జరపుకోవడం నాకు చాలా ఆనందకరం. మీ అందరికీ మాత్రుభాషా దినోత్సవ శుభాకాంక్షలు. అన్నట్టు చివరిగా...గిడుగు వారు తూర్పు గోదావరి జిల్లా లోని తెలుగు భాషే ప్రామాణికముగా తెలిపారు. అంటే మాది రాజమండ్రి లెండి. కొంచెం స్వార్ధం.ఆయ్...మరి ఇంక ఉంటానండి.