భావ వ్యక్తీకరణకు భాషే ఆత్మ.తెలుగు మీద నాకున్న అభిమానమే తెలుగు తీరాలు మొదలు పెట్టించింది.
తెలుగు సాహిత్యం, సంగీతం, కవిత్వం, పండుగలు, కథలు, వంటలు, సినిమాలు, తెలుగు వీరులు...ఇలా నాకు తెలిసినవి, నచ్చినవి..ఎన్నో విషయాలను తెలుగు తీరాలకు చేర్చాలని నా ప్రయత్నం.
అభిమన్యుని పెళ్ళి జరిగిందని మనకు తెలుసు గాని, ఎలా జరిగిందో తెలియదు. ఎప్పుడూ, ఎక్కడా పెద్దవాళ్ళు కూడా ప్రస్తావించటం వినలేదు. ఇతిహాస గాధ కు అద్భుత కల్పన జోడించి వెండితెర పై మాయాబజారు అనే ఇంద్రజాలాన్ని ఆవిష్కరించారు ఈ చిత్ర బ్రుందం వారు. ఈ కధ తెలుగు వారికి ఎంత చేరువైనదో నేను ప్రత్యేకించి చెప్పక్కరలేదు. కధా బలం, సంభషణా చాతుర్యం, హాస్యం, కల్పన, సంగీతం, చాయాగ్రహణం, నటీనటుల ప్రతిభ,ఇలా ప్రతీ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచిన వారే అందరు, అందువలనే ఈ రోజుకీ ఈ చిత్రానికి ఇంత ఆదరణ.
అసలు ఈ చిత్రం గురించి ప్రస్తావించాలంటే ఎక్కడనించి మొదలు పెట్టాలో అర్ధం కావట్లేదు.
కధారంభంలో ముఖ్యమైన పాత్రలను పరిచయం చేసి, శశి- అభిమన్యుల స్నేహం, శౌర్యం, వారి పెళ్ళి మాటలు చూపిస్తారు. కాలం గడిచి శశి- అభిమన్యులు ఒకరికొకరు ఎదురు పడటం చాలా బాగుంటుంది. ఈ సన్నివేశం ఊహించి, తెర పైన ఆవిష్కరించిన రీతి అద్భుతం. కంప్యూటరంటే తెలియని రోజుల్లో, ప్రియదర్శిని అన్న పేటిక లో ఇష్టమైన వారిని చూడవచ్చు అనే కల్పన ద్వారా నాగేశ్వర రావు( అభిమన్యుడు), సావిత్రి (శశీ) యుగళ గీతం పాడేస్తారు ( నీవేనా నను పిలచినది....నీవేనా నను తలచినది.. నీవేనా నా మదిలో నిలచీ హ్రుదయము కలవర పరచినది, నీవేనా,,,). దానితో పాటూ, బలరాముడు-రేవతి పాత్రల వ్యక్తిత్వం మనకు చెప్పడం జరిగింది. ఆహా పాటా పాడేసుకున్నాం కదా పెళ్ళాడేద్దమనుకోగానే, పాండవులు రాజ్యం పోయి, సుభద్ర కొడుకుతో సహా పుట్టిల్లు, ద్వారక చేరుకుంటారు. ఈంకేముంది రాజ్యహీనులకి కూతుర్నివ్వడం ఇష్టం లేక రేవతి, సుభద్రతో సరిగ్గా ఉండదు. ఇంతలో, బలరాముడు, సుయోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుని తో శశి పెళ్ళి కుదుర్చుకొస్తాడు. ఈ సంఘటనలతో శశి మనస్తాపం చెంది, క్రుష్ణుడి సాయమైనా అందుతుందేమోని అనుకుంటుంది. పెద్దవారు శశిని తన బావను కలవద్దొని ఆంక్షలు పెడతారు. వారి మాటలు గాలికొదిలేసి, లాహిరి లాహిరి..లాహిరిలో.. అంటూ ఒక మాంచి పాట కూడా పాడేసుకుంటారు. ఈ పాటకు ఒక ప్రత్యేకత ఉంది, ప్రధాన జంటలైన శశి- అభి; రుక్మిణి- క్రుష్ణుడు; రేవతి-బలరాములూ అందరూ ఒకరి తర్వాత ఒకరు, నౌకా యానం చేస్తూ ఈ పాట పాడేసుకుంటారు. సుభద్రాభిమన్యులకీ, బలరామరేవతులకీ వాగ్వివాదం జరగి, క్రుష్ణుడు సుభద్రాభిమన్యులను అడవికి పంపేయటం తో అసలు కధ కు తెరలేస్తుంది. మన అసలు నాయకుడు కాదు..కాదు, మన అసలు నాయకుడి పాత్ర ప్రవేశిస్తుంది. అదే ఘటోత్కచుడి పాత్ర. మన యస్వీ. రంగారావు!! ఇక్కడ నాయకుడి పాత్ర అని నేను అనడానికి కారణం ఈ కధలో నాయకుడి పాత్ర ఘటోత్కచుడైనా, నాయకుడు మాత్రం సావిత్రి!!
ఘటోత్కచుడి రాజ్యం, అతని మంత్రులు, మంత్రిగారి శిష్యులైన లంబూ-జంబూ పాత్రలు మనని కడుపుబ్బ నవ్విస్తాయి. అసమదీయులు, తసమదీయులు, దుషట చతుషటయం, అనే లంబూ-జంబూల పలుకులు భలే ఉంటాయి. ఇంత కధలో మంచి పాట కూడా వస్తుంది ( భళి భళి భళి భళి దేవా...బాగున్నదయా నీ మాయా...) పరులెవరో తన రాజ్యం లోకి ప్రవేశిస్తున్నరని, ఘటోత్కచుడు, అభిమన్యుడి మీద దండెత్తుతాడు, సోదరులని తెలిసి సంతోషిస్తారు. సుభద్ర-హిడింబి (సూర్యకాంతం) కూడా ఆనందిస్తారు. ఇహ ఇక్కడినించి అసలు మాయాబజారు స్రుష్టి కి బీజం పడుతుంది. శ్రీ క్రుష్ణుడు సూత్రధారి గా ఈ కధను నడిపిస్తాడు. అందులో భాగంగా అసలు శశి ని మాయం చేసి, ఘటోత్కచుడు మాయా శశిగా మారి ద్వారక లో ప్రవేశిస్తాడు. అంటే తెర మీద ఘటోత్కచుడుగా మనకు కనపడేది మాత్రం సావిత్రి!!!! ఈ మాయ శశి, మనది సోదర ప్రేమ అంటూ అభిమన్యుడిని ఏడిపించడం భలే బాగుంటుంది. ద్వారక చేరిన ఘటోత్కచుడి గర్వ భంగం అద్భుతమైన హాస్యంతో కూడుకున్నది, శ్రీ క్రుష్ణుడు ముసలి తాతగా మారి "చిన చేప ను పెద చేప.....చిన మాయ ను పెను మాయ..." అంటూ ముప్పు తిప్పలు పెడతాడు!
ఘటోత్కచుడి మంత్రి శిష్యులతో కలిసి మాయాబజారు స్రుష్టించేస్తాడు. పెళ్ళి వారు హస్తినాపురం నుండి తరలి వస్తారు, లక్ష్మణ కుమారుడి బ్రుందం శకుని మాట మేరకు, పెళ్ళి వారిని ప్రతిదానికీ తప్పు పట్టాలని, కంబళి కాదు, గింబళి ; తల్పం కాదు, గిల్పం తెమ్మని ఇబ్బంది పెట్టినా, ఆడ పెళ్ళి పెద్దలైన లంబు-జంబులు , అన్నీ ఇస్తారు. ఒక సారి మొత్తం పెళ్ళీ వారికి సరిపడ వంటను మన ఘటోత్కచుడు వివాహ భోజనంబు...హహహా..అంటూ పాడుతూ మరీ లాగించేస్తాడు, చూసినప్పుడల్లా, నాకు లొట్టలు వేయడమే మిగిలేది!!! ఘటోత్కచుడు అంతా తినేశాకా, అక్కడ ఖాళీ గిన్నెలు చూసి, శాస్త్రి-శర్మలు, శకునికి ఫిర్యాదు చేసి మరి పాకశాలకు తీసుకొస్తారు, కాని ఈ లోగానే, రాక్షస మాయ చేత, మళ్ళీ వంటలు స్రుష్టించేస్తారు! ఇంకేముంది శకుని వాళ్ళను చెడా మడా తిడతాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే, కధను మన తెలుగు వారికి ఎంత దగ్గరగా తీసుకొచ్చారంటే, పెళ్ళి వంటకాలలో మన తెలుగు వంటలు కనపడతాయి, అంతే కాక, గోంగూర పచ్చడి లేనిదే, వంట సంపూర్ణం కాదని మగపెళ్ళి వారు అంటారు. ద్వారక ఏదో మన ఆంధ్రప్రదేష్ లోనిదే అన్నట్టూ, క్రుష్ణుడు వాళ్ళూ మన తెలుగు వాళ్ళన్నట్టు అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే!!!అన్నట్టు మరిచాను, లంబు- జంబులు అంతమంది జనాన్ని చూసి "నర మాంసం..." అంటూ లొట్టలేయడం, వాళ్ళ గురువు వారించడం భలే నవ్వొస్తుంది. ఇంతలో సుయోధన చక్రవర్తి పట్టపు రాణి భానుమతి దేవి, కొడలికి కానుకలు ఇస్తుంది, మాయ శశి, వాటికి ముట్టుకున్నంత మాత్రానే అవి విరిగిపోతాయి, ఇవి నాకన్నా నాజూకు గా వున్నాయి అంటూ అనేసి, లక్ష్మణ కుమారుని భరతం పట్టడానికి వెళ్తుంది మాయా శశి, లక్ష్మణ కుమారుడు కూడా మరదలి అందం చూసి, సుందరి నీ వంటి దివ్య స్వరూపము...అంటూ పాడి , ఆడగానే చేతులు అ తుక్కుపోతాయి, శశి పారిపోతుంది! శశి పెళ్ళికి తయారవుతూ, ఆహ నా పెళ్ళి అంట.... అంటూ ఒక అద్భుతమయిన పాట వస్తుంది...ఈ పాట లో సావిత్రి తన సినీ జీవితం మొత్తంలోకీ అత్యద్భుత నటన ప్రదర్శించిందనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇహ ఆఖరి ఘట్టం లో ఒకే ముహూర్తానికి, శశి-అభిమన్యు; మాయా శశి-లక్ష్మణ కుమారుడి వివాహాలు మొదలవుతాయి. ఘటోత్కచుడు తన మాయ చేత లక్ష్మణ కుమారునికి భ్రమలు కల్పించి పిచ్చి వాడిలా చిత్రీకరించి, పెళ్ళిని కాస్తా గందర గోళం చేసి, దుష్ట చతుష్టయమైన సుయోదహన-దుశ్శాసన-కర్ణ-శకునులను ద్వరక అవతల పడేస్తాడు. అసలు శశి-అభి తమ కుటుంబాన్ని కలవడం తో కధ సుఖాంతమవుతుంది. శ్రీ క్రుష్ణుడి విశ్వ రూప దర్శనానికి, ఘటోత్కచుడు పరవశించి స్తుతించడం తో శుభం!!!! అన్నింటికన్నా ముఖ్యమైనది, కధలో పాండవులను చూపించకుండా, ప్రస్తావన చేత మాత్రం వారు ఉన్నట్టే అనిపించేట్టు, కధ నడిపించడం నిజంగా దర్శకుని ప్రతిభకు నిదర్శనం!!! ఈ సినిమాలోని పాటలన్నీ బాగుంటాయి, భస్మాసుర వంటి న్రుత్య రూపకాలు కూడా అలరిస్తాయి!కధ చెప్పేశా, మరి ఈ కధ వెనుక వారి గురించి ఇప్పుడు చెపుతా....
సంగీత, సాహిత్యాల విషయానికి వస్తే, ఈ చిత్రము ఒక మహాద్భుతమని చెప్పవచ్చు. మాయాబజార్ సినిమా కోసం పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు అజరామరంగా నిలుస్తాయి. ఈ చిత్రంలో రచయిత పింగళి నాగేంద్రరావు తస్మదీయులు, దుష్టచతుష్టయం , జియ్యా , రత్న గింబళీ, గిల్పం, శాఖంబరి దేవి ప్రసాదం, వంటి కొత్త పదాలను మనకు రుచి చూపిస్తాడు. రసపట్టులో తర్కం కూడదు, భలే మామా భలే, ఇదే మన తక్షణ కర్తవ్యం, ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయి, వేసుకో వీరతాడు వంటి సంభాషణలు మనల్ని గిలిగింతలు పెట్టిస్తాయి.ఈ చిత్రానికి మొదటగా సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకులుగా నియమితులయ్యారు. 4 యుగళగీతాలకు స్వర కల్పన చేసాక, కారణాంతరాల వలన ఆయన తప్పుకోగా సంగీత దర్శకుడిగా ఘంటసాల నియమితులయ్యారు. రాజేశ్వరరావు కట్టిన బాణీలకు వాయిద్య సంగీతాన్ని సమకూర్చి రికార్డు చేసారు ఘంటసాల. ఘంటసాల , పి.లీల , పి.సుశీల , మాధవపెద్ది సత్యం మొదలగు వారి నేపధ్య గానంలో వచ్చిన , నీవేనా నను తలచినది, చూపులు కలసిన శుభవేళా, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమె నే జీవించునదీ, సుందరి నీవంటి, ఆహ నా పెళ్ళీ అంటా, వివాహభోజనంబు వంటి గీతాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. చమత్కారమేమిటంటే ఈ పాటల పల్లవులు తర్వాతి కాలంలో సినిమా పేర్లుగా వాడుకోబడ్డాయి. ఆలాగే లాహిరి లాహిరి లాహిరిలో అన్న ఒకే పాటకు ముగ్గురు నటులకు (ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్ , గుమ్మడి) ఘంటసాల పాడటం ఒక ప్రత్యేక విశేషం.
ఇక స్క్రిప్టు మనల్ని తల తిప్పుకోనీయకుండా చేస్తే మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం, హర్బన్స్ సింగ్ స్పెషల్ ఎఫెక్ట్లూ మనల్ని రెప్ప వాల్చనీయకుండా చేస్తాయి. ఈ చిత్రానిది ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యుత్తమమైన స్క్రీన్ ప్లే అని గుమ్మడి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. "లాహిరి లాహిరి లాహిరిలో" పాటను చూసి తెలుగు సినిమా చరిత్ర లోనే వెన్నెలనింత అందంగా ఇంకెక్కడా చూడలేదు' అనుకున్న వారు ఆ పాటను మండుటెండలో తీశారని తెలుసుకుని తెల్లబోయారు. ఇక స్పెషల్ ఎఫెక్టులా లెక్కపెట్టలేనన్ని. మచ్చుకు కొన్ని:
* అభిమన్యుడి దగ్గరకు తొలిసారి వచ్చినప్పుడు ఘటోత్కచుడు కొండ మీద దూకగానే ఆ అదటుకు కొండకొమ్ము విరిగి పడడమూ,
* మాయామహల్లో కంబళి లా కనిపించే గింబళి తనంతట తనే లోపలికి చుట్టుకోవడం,
* తల్పం లాంటి గిల్పం గిరగిరా తిరిగి క్రిందపడదోయడం లాంటి విడ్డూరాలు,
* ఘటోత్కచుడి "వివాహభోజనం"బు షాట్లు
కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఈ షాట్లు ఎలా తీయగలిగారనేది తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.
ఈ సినిమాలో నటించిన కొందరు కళాకారులు
కృష్ణుడు : ఎన్.టి.ఆర్ :అంతకు ముందు ఒక సినిమాలో వేసిన కృష్ణుని పాత్రకు మంచి స్పందన రాలేదు. కనుక ఈ సినిమాలో చాలా జాగ్రత్త తీసుకొని ఎన్.టి.ఆర్.కు ఈ పాత్ర, మేకప్ రూప కల్పన చేశారు. తరువాత కధ ఎవరికి తెలియదు?
అభిమన్యుడు :ఏ.ఎన్.ఆర్
శశిరేఖ:సావిత్రి
ఘటోత్కచుడు:ఎస్.వి.రంగారావు:ఈ సినిమాలో పాత్ర చిత్రీకరణ వల్ల తెలుగువారికి ఘటోత్కచుడు చాలా ప్రియమైన వ్యక్తి ఐపోయాడు.
లక్ష్మణ కుమారుడు:రేలంగి:లక్ష్మణ కుమారుని హాస్యగానిగా చూపడం మహాభారత కధలో అతని పాత్రకు అనుగుణంగా లేదు. కాని ఇది "మాయ" బజార్ కదా?
చిన్నమయ:రమణా రెడ్డి
బలరాముడు:గుమ్మడి వెంకటేశ్వరరావు
శకుని:సి.ఎస్.ఆర్
రేవతీ దేవి: ఛాయా దేవి
సుభద్ర:ఋష్యేంద్రమణి
రుక్మిణి:సంధ్య
సాత్యకి:నాగభూషణం
కర్ణుడు:మిక్కిలినేని
దుశ్శాసనుడు:ఆర్.నాగేశ్వరరావు
లంబు:చదలవాడ కుటుంబరావు
జంబు:నాల్ల రామ్మూర్తి
కృష్ణుడు మాయా రూపంలో ఉండి అటు నేనే ఇటు నేనే పాట పాడే పాత్రధారి: కంచి నరసింహారావు
శర్మ:అల్లు రామలింగయ్య
దారుకుడు: మాధవపెద్ది సత్యం
శాస్త్రి: వంగర వెంకటసుబ్బయ్య
హిడింబి : సూర్యకాంతం
మాయలు
* అభిమన్యుడి పెళ్ళి చుట్టూ మూడు గంటల సేపు కథ నడిస్తే పాండవులెక్కడా కనిపించకపోయినా వాళ్ళేమయారనే అనుమానమెక్కడా ప్రేక్షకులకు రాలేదంటే అది దర్శకుడు పన్నిన మాయాజాలమే. కానీ ఒక్క చోట ద్రౌపది లీలగా కనిపిస్తుంది (విన్నావటమ్మా, ఓ యశోదా పాట చివరిలో)
* "అహ నా పెళ్ళంట.." పాటలో తధోంధోంధోం తధీంధీంధీం అనే బిట్ ని పాడింది మాధవపెద్ది సత్యం కాదు. ఘంటసాల.
* "దురహంకార మదాంధులై.." అనే పద్యానికి ముందు వచ్చే "విన్నాను మాతా విన్నాను.." అనే సుదీర్ఘమైన డైలాగ్ ను పలికింది రంగారావు, మాధవపెద్ది సత్యం కాదు.
* ఆశ్చర్యం: ఈ సినిమాలో కర్ణుడికి అసలు కవచ కుండలాలే లేవు.
* ఈ చిత్రంలో ప్రముఖ నేపథ్య గాయకులు మాధవపెద్ది సత్యం , భళి భళి భళి భళి దేవా గీతంలో రథసారథి పాత్రలో కనిపించి మనల్ని అలరిస్తారు.
ఈ సినిమాలో హిట్టయిన పాటలకు సాలూరు రాజేశ్వరరావు అసలు సంగీత దర్శకుడు. (చూపులు కలసిన శుభవేళా, నీవేనా నను తలచినది, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమె నే జీవించునది) కానీ చక్రపాణితో వచ్చిన విభేదాలవలన సాలూరు తప్పుకొనగా మిగిలిన సంగీతాన్ని ఘంటసాల అందించాడు. అయితే సినిమా టైటిల్స్లో సాలూరు రాజేశ్వరరావు పేరు చూపలేదు. పాట / పద్యం: గీతరచన : నేపథ్యగానము
నీవేనా నను తలచినది: పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల
లాహిరి లాహిరి లాహిరిలో: పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు,పి.లీల
వివాహ భోజనంబు : పింగళి : మాధవపెద్ది సత్యం
అహ నా పెళ్ళియంట : పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు, సుశీల
భళి భళి భళి దేవా : పింగళి : మాధవపెద్ది సత్యం
చూపులు కలసిన : పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు,పి.లీల
నీకోసమె నే జీవించునది : పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల
సుందరి నీవంటి దివ్య : పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు, సావిత్రి
దయచేయండి : పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల,సుశీల,మాధవపెద్ది సత్యం
విన్నావటమ్మాయశోద : పింగళి : పి.లీల,సుశీల,స్వర్ణలత
వర్ధిల్లు మా తల్లి : పింగళి : ఎమ్.ఎల్.వసంతకుమారి
అఖిల రాక్షస (పద్యం) : పింగళి : ఋష్యెంద్రమణి
అల్లి బిల్లి ఆటలె : పింగళి : సుశీల
అష్టదిక్కుంభి (పద్యం) : పింగళి : మాధవపెద్ది సత్యం
దురహంకార(పద్యం) : పింగళి : మాధవపెద్ది సత్యం
శకునియున్న(పద్యం) : పింగళి : సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
శ్రీకరులు దేవతలు : పింగళి : బృందగానం
స్వాతిశయమున(పద్యం) : పింగళి : మాధవపెద్ది సత్యం
జై సత్య సంకల్ప జై
శేషతల్పా(పద్యం) : పింగళి : మాధవపెద్ది సత్యం
ఈ సినిమాకు ఈ మధ్య కాలం లో రంగులద్దరు కూడా!!!నలుపు తెలుపులో ఉన్న ఈ చిత్రాన్ని గోల్డ్స్టోన్ అనే సంస్థ 2010 జనవరి 30 న రంగుల్లో విడుదల చేశారు. మాయాబజార్ పాత ఫిల్ములో సౌండ్ ట్రాక్లన్నీ పూర్తిగా అరిగిపోవడంతో వినసొంపుగా లేవు. అందుకని మూలం చెడకుండా నేపథ్య సంగీతం మొత్తం రీరికార్డింగ్ చేశారు. దాని తర్వాత సినిమాను 70 ఎం.ఎం కి మార్చి డీటీఎస్ కి మార్చారు. ఇందుకోసం 165 మంది నిపుణులు దాదాపు ఏడాది సమయం పాటు పనిచేశారు!!!!!!ఇహ శెలవు !!నమో క్రిష్ణ!!!నమో క్రిష్ణ!!!!!నమో...నమో!!
చలం, ఈ పేరు వినగానే గుర్తొచ్చేది "మైదానం". విప్లవ రచనలు చేసిన వారు ఎందరు ఉన్నా, స్త్రీవాదం అనగానే స్ఫురించేది గురజాడ, కందుకూరి, చలం. స్త్రీవాదం లో చలానిదొక ప్రత్యేక శైలి. మిగతా వారు సమాజం లో ఉన్న దురాచారలను దుయ్యబట్టినా, కుటుంబ, సమాజ నియమోల్లంఘన కావించక, ఆడది తన కష్టాల నుండి వేరొకరి సహయం తో ఎలా బయట పడిందో సున్నితంగా, వ్యంగ్యంగా చెప్పటం చేశారు. అయితే చలం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా మైదానం లో రాజేశ్వరి పాత్రను చిత్రీకరించారు. రాజేశ్వరిది ప్రేమరాహిత్యాన్ని అనుభవించే పాత్ర. భర్త దగ్గర తాను పొందలేని ప్రేమను వేరొకరి దగ్గర వెతుక్కుంటూ, సమాజపు కట్టుబాట్లను ఎదిరిస్తుంది రాజేశ్వరి. బుద్ధిని ఉపయోగించక, కేవలం మనసు మాట వింటూ, తాను తీసుకున్న నిర్ణయాలకు ఎలా బలయి పోయిందన్నది కధాంశం. స్త్రీవాదం కంటే కూడా నాకు ఈ నవల లో విచ్చలవిడితనం, నియమోల్లంఘన అధికంగా స్ఫురించాయి. కథ లో అంతర్లీనంగా కట్టుబాట్లను కాదంటే ఎదురయ్యే కష్టాల గురించి ఉన్నా, రాజేశ్వరి మానసిక సంఘర్షణను అద్భుతంగా వర్ణించినా, పాఠకుల ద్రుష్టి ఆ అంశం పైన పడటం కష్టం. రాజేశ్వరి భర్తను విడిచి పెట్టి పరాయి వాడితో వెళ్ళిపోవడం, తరువాత అతడు ఆమెని అవసరాలకు వాడుకొని వదిలేయడం, ఈ క్రమంలో ఇంకో మగాడు పరిచయమవటం.... ఇలా రాజేశ్వరి జీవిత పయనం గమ్యం లేనిదై, కోరుకున్న ప్రేమ దొరకక, హత్యా కాండ లో అంతమై, చివరికి న్యాయస్థానం లో నిలబడుతుంది. ఖచ్చితంగా ఈ కథ లో , నియమోల్లంఘన వల్ల వచ్చే నష్టాల కన్నా కూడా బరితెగించడం అన్న అంశం మీదనే పాఠకుల ద్రుష్టి పోతుంది. ఈ రచన ద్వారా చలం సమాజానికి ఏం చెప్పదలచుకున్నదీ నాకైతే అర్ధం కాలేదు!!!
భారతదేశ0 లోనే ప్రప్రధమంగా భాషను ఆధారంగా చేసుకుని అవతరించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పొట్టి శ్రీరాములు గారి మరణం మన తెలుగు వారి అస్థిత్వాన్ని కాపాడిందనే చెప్పాలి. ఆయన మరణించాకా దాదాపు ఏడాదికి గానీ ఆంధ్రా పుట్టలేదు.15 డిసెంబరు 1952న పొట్టి శ్రీ రాములు అమరులయ్యారు.నవంబరు 1, 1953 లో ఆంధ్ర రాష్ట్రం పుడితే, తెలంగాణాను కలుపుకుని సంపూర్ణం గా తెలుగు వారితో కూడిన రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది మాత్రం నవంబరు 1, 1956 లో. మన యావత్తెలుగు జాతి కలిసి మెలిసి సుఖ సంతోషాలతో జీవించాలని, మన రాష్ట్ర అవతరణ దినోత్సవాన మనస్పూర్తి గా కోరుకుంటున్నాను. జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి!
మన రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లి మీ కోసం ..
మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి. గలగలా గోదారి కదలిపోతుంటేను బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయీ మురిపాల ముత్యాలు దొరులుతాయి. అమరావతినగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములొ తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక నీపాటలే పాడుతాం ,నీ ఆటలే ఆడుతాం జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి ......
ఈ పాట శంకరంబండి సుందరాచారి, దీనబంధు అనే చలన చిత్రం కోసం 1942 లో లిఖించగా, టంగుటూరి సూర్య కుమారి ఆలపించారు. ఈ మధ్యనే ఈ పాటను శేఖర్ కమ్ముల "లీడర్" అనే చలనచిత్రంలో వాడుకున్నారు.
పొట్టి పిచ్చిక ..ఈ కథ మా తాతయ్య, మా అమ్మకి చిన్నప్పుడు చెప్పేవాడట. అంటే.. పెద్దయ్యకా కూడా వాళ్ళ అక్కయ్య చేత చెప్పించుకునేదిలే... ఇక కథ చెపుతానే.. అనగనగా........ఒక ఊళ్ళో ఒక అబ్బి. ఆ అబ్బి కి పెద్ద ఉద్యోగం. రోజూ పొద్దున్నే మాంచిగా తయారయి ఇవతలకొస్తాడు. ఉద్యోగానికి వేళ్ళే దారిలో ఒక వెలగ చెట్టు ఉంది. అబ్బి రోజూ ఆ వెలగపళ్ళకేసి ఆశగా చూస్తూ వెళ్తూ ఉంటాడు. అదే చెట్టు మీద ఒక పిచ్చిక గూడు కట్టుకుని, ఎంచక్కా వెలగపళ్ళన్నీ గుటకాయ స్వాహా చేస్తుంటుంది. మన అబ్బి ఈ పిచ్చిక సంగతి కనిపెట్టి, " పొట్టి పిచ్చిక …. పొట్టి పిచ్చిక ..నీ పొట్ట పిసకా..నాకో పండివ్వా.." అని అడిగాడు. పిచ్చిక్కేమో అది దాని సొంత చెట్టు....పళ్ళన్నీ అదొక్కతే తినాలి. బాగా ఆలోచించి రేప్పొద్దున్నే బయటికి వెళ్ళే ముందు కనపడు, ఇస్తాను అంది. ఇంకేముంది, మన గురువుగారు ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు వెలగపండు తిందామా అని ఎదురుచూస్తూ నిద్దరోయాడు. తెల్లారింది..మనవాడు మాంఛి ఖద్దరు లాల్చీ,పైజమా వేసుకుని, అత్తరు పులుముకుని తయారవుతున్నాడు. ఈలొగా పిచ్చిక కడుపునిండా వెలగపళ్ళు తినేసి, ఒక పెద్ద పండుని డొల్ల చేసి, అందులో బురద నింపి, అబ్బికి అనుమానం రాకుండా పైన వేరే డిప్పతో కప్పి, తన అస్త్రాన్ని సిద్ధం చేసేసుకుంది. మన అబ్బి ఆశగా, చెట్టు కింద నించుని పిచ్చికా..నేను వచ్చాను, నాకు పండివ్వా అని దోసిలి పట్టి అడిగాడు. ముందే సిద్ధం చేసుకున్న బురద వెలగపండును పిచ్చిక పారేసింది...అబ్బి బట్టలు బురదైపొయాయి, అబ్బికి కోపం వచ్చింది. నీ పని ఇలా ఉందా చెబుతానంటూ , నెమ్మదిగా పిచ్చిక్కి తెలియకుండా చెట్టెక్కి దాన్ని పట్టేసుకుంటాడు. అబ్బి ఆ పిచ్చికని చలి కాలమని కూడా చూడకుండా గోదారిలో ముంచి లేవనేత్తి, "ఇప్పుడెలా ఉందో చెప్పవే పొట్టి పిచ్చికా?" అంటాడు. దానికి పొట్టి పిచ్చిక "వెలగపండు తిని వచ్చితిని, చెరువులో స్నానము చేసితినీ...హా..హా.." అంది. నీ పని ఇలా ఉందా.. ఇప్పుడెలా ఉందే అంటూ నిప్పుల మీద అటూ ఇటూ తిప్పాడు. దానికి పొట్టి పిచ్చిక, "వెలగపండు తిని వచ్చితిని, చెరువులో స్నానము చేసితిని, గట్టు పై చలి కాగితిని..", అంది. ఈ మాటు, పిచ్చికని ఇంటికి తీసుకుపోయి, పక్కనే పిండి దంచుతున్న వాళ్ళ చేత రోకలి పోట్లు వెయించి, ఇప్పుడెలా ఉందే అన్నాడు. దానికి పొట్టి పిచ్చిక, "వెలగపండు తిని వచ్చితిని, చెరువులో స్నానము చేసితిని, గట్టు పై చలి కాగితిని.అవ్వతో పిండి దంపితిని" అంది. అబ్బికి ఏం చేయాలో తోచక మంచాలల్లుతున్న చోటికి పోయి, పిచ్చికని మధ్యలో పెట్టి రెందల్లులు వేయించి, ఇప్పుదెలా ఉందే అన్నడు. దానికి పొట్టి పిచ్చిక, "వెలగపండు తిని వచ్చితిని, చెరువులో స్నానము చేసితిని, గట్టు పై చలి కాగితిని.అవ్వతో పిండి దంపితిని, తాతతో దడి అల్లితిని" అంది. చేసేదేదీ లేక, అబ్బి, పొట్టి పిచ్చికని పెళ్ళానికిచ్చి, ఈ రోజు పిచ్చికని వండని చెప్పి బయటకి పోతాడు. పెళ్ళమేమో, పిచ్చికని బుట్ట కింద దాచి, వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఈ లోగా మన పిచ్చికగాడు బుట్టను ఎగిరేగిరి తన్ని, తప్పించుకు వెలగ చెట్టెక్కేశాడు. పెళ్ళం వచ్చేసరికి పిచ్చిక లేదు. అబ్బి తిడతాడేమోనన్న భయం వలన, చూరు పైనున్న కాకి గూట్లోని కాకి పిల్లల్ని వండేసింది. అబ్బి మహదానందంగా ఇంటికొచ్చి, కాళ్ళూ,చేతులు కడుక్కుని, బల్ల పైన వెండి కంచం పెట్టుకుని, ఒసేయ్ పెళ్ళం! నాకు పిచ్చికని వడ్డించన్నాడు. పెళ్ళం, అబ్బి ఎక్కడ కనిపెట్టస్తాడో అన్న భయంతో వణికిపోతూ వడ్డించింది. అబ్బి, ముక్కను నోట్లో పెట్టుకుని, ఇప్పుడేలా ఉందే పొట్టి పిచ్చికా అంటూ కొరికాడు. వెంటనే చెట్టుమీద పిచ్చిక, చూరులో చేరి,"వెలగపండు తిని వచ్చితిని, చెరువులో స్నానము చేసితిని, గట్టు పై చలి కాగితిని, అవ్వతో పిండి దంపితిని, తాతతో దడి అల్లితిని, బుట్టలో దాగితిని, అబ్బితో కాకి మాంసం తినిపించితినీ...భలే..భలే..అబ్బితో కాకి మాంసం తినిపించితినీ...హహ..హహ.." అంటూ ఎగిరిపొయింది. అబ్బి చేతిలో పెళ్ళానికి మూడింది. ఆ తరువాత,పెళ్ళం చేతిలో చీపురికి పని దొరికింది!!!! ఈ కథ చిన్నప్పుడు ఇష్టంగా వినటానికి కారణం, ఒకే పదం చాలా సార్లు మళ్ళీ, మళ్ళీ రావటం. మొత్తానికి చిననాటి కథ మీకు చెప్పేశాను.
చిన్నప్పుడు మా అమ్మ తో కలిసి, వాళ్ళ కళాశాల వార్షికోత్సవానికి ప్రతి ఏడూ వెళ్ళేదాన్ని. మా విజయవాడ లో తుమ్మలపల్లి కళాక్షేత్రమని పెద్ద హాలు ఉంది, అక్కడే ఈ కార్యక్రమాలన్నీ జరిగేవి. ఎప్పుడో సరిగ్గా గుర్తు లేదు గానీ, ఒక సారి అలా మా అమ్మ శిష్యులే ఒక న్రుత్య రూపకం ప్రదర్శించారు. అమ్మా, జానకి ఆంటీ పాడారు, వాళ్ళ ప్రధానోపాధ్యాయులు పుష్పవతి గారు రచన. అంటరానితనం ఉండకూడదని ఆ ప్రదర్శనలో ఒక్కొక్క పూవు చెపుతుంది. చాలా బాగుంటుంది. రంగు పూలన్నీ, గడ్డి పూవు ని వెలేస్తే, అది దేవుడి గుడి ముందు ఏడుస్తూ, అంటరాని దానిననీ, అంటుకో కూడదని ఆమడ దూరం తరిమి, తరిమి కొడతారు ...ఇలా సాగుతుంది. చాలా రోజులకు, పూవులు మాట్లాడుకోవడం అనే ఇతివ్రుత్తం తో, ఆ మధ్యన ఆగష్టు 15 కి, అందరూ కలిసి ఉండాలని, ఈ కదంబం కూర్చాను.
తోటన పెంచిన పూవులు అన్నీ పై చేయికి పోటీ పడ్డవి ! గొప్పలు పల్కుతు సుమములు అన్నీ తమ శ్రేష్టతను తెల్పుతున్నవి.
జాబిలి మరపించు జాజిని నేను జాగు జేయక ముదితలు నను జడన ముడిచేరు పూచినంతనే తావి విరజిమ్మెదను నేను పూవులకు రారాణి నేను !
మనసులు మురిపించెడి మల్లెను నేను ధవళ వర్ణమున సొగసులీనుతాను మగువ మనసులు దోచి యేలేను నేను పూరాణి కాక ఇంకేరు నేను !
గుండెన ప్రేమను నింపెడి గులాబి నేను మదనుడి విరి శరమ్ము నేను ప్రేమ సామ్రజ్యమ్ము యేలుదానను నేనుగాక పూరాణి ఇంకెవ్వరగును !
పసుపు రంగున పూచె చామంతి నేను వన్నె తగ్గక నేను వెలుగుతాను పసిడి కాంతులు చిమ్ముదానను నేను పూదోట పట్టపురాణి నేను !
ఇంతులు మెచ్చెడి బంతిని నేను ఇంటికి స్వాగత మాలను నేను ఇంతకు మించిన అర్హత ఏమది పూవులనందున రాణిని నేను !
గోవులు తెల్లన..గొపయ్య నల్లన..(సప్తపది) అనే పాట రచనకు వేటూరి వారికి స్పూర్తి విశ్వనాథ సత్యనారాయణ రచనే అని చాలా సార్లు చెప్పారు.వేటూరి పైన నాకున్న అభిమానం చేత విశ్వనాథ వారి రచన ఏదైనా చదవాలనుకున్నాను.అలా చదివినదే ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి మరియూ ఆంధ్ర విశ్వకళా పరిషద్పురస్కారాన్నందుకున్న "వేయి పడగలు".ఈ నవల 1920 ల కాలంలో మొదలయ్యి, స్వాతంత్ర్య పోరాట కాలం వరకూ సాగుతుంది.మొత్తం గ్రాంధిక భాష లో ఉంటుంది.ఈ తరం వారికి అర్ధం అవటం కష్టం.భారత దేశపు ఆత్మ అయిన భిన్నత్వం లో ఏకత్వం,ఏకత్వం లో భిన్నత్వం అన్నది ఏదైతే ఉందో,దానికి హైందవ ధర్మ శాస్త్రాన్ని జోడించి ఈ వేయి పడగలు కి పునాది వేశారు.కథా వస్తువు ఏదైనప్పటికీ ఈ పుస్తకం చదవటం వలన భాషాభివ్రుధి ఖాయం.మానవ సంబంధాల సున్నితత్వాన్ని,గాఢతను రామేశ్వర శస్త్రి భార్యల మధ్యా,సంతానం మధ్యనా చెబితే,భార్యా భర్తల బంధాన్ని ధర్మారావు-అరుంధతి పాత్రల ద్వారా చెప్పారు.వీటన్నిటికన్నా చిన్న జమిందారు-ధర్మారావు-గిరికల బంధం చిత్రమనిపిస్తుంది.పసిరిక పాత్ర ఒక వింత.ముఖ్యంగా నేను జమిందారీ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను.అలాగే స్నేహ బంధాలు బాగా చెప్పారు. ఆనాటి దేశ కాలధర్మ పరిస్థితి ఏమిటో,స్వధర్మాన్ని పరిత్యజించి పాశ్చాత్య నాగరికతానుసరణ వల్ల వచ్చే నష్టాలేమిటో,జమిందారు పాత్ర ద్వారా చెప్పబడింది.ఆధునికత మోజులో పడి, ప్రక్రుతి అందాలను మనం ఎలా కోల్పోతున్నామో చక్కగా వివరించారు.మురుగు నీరు సమస్యలూ,కంకర వల్ల వచ్చే అధిక వేడీ,వాతావరణం లో మార్పులూ కొన్ని పాత్రల ద్వారా చెప్పించారు విశ్వనాథ వారు.ఈ సమస్యలను మనం,ఈ కాలం పూర్తి స్థాయి లో అనుభవిస్తున్నాము.అన్నింటి కన్నా ముఖ్యంగా ధర్మా రావు పాత్ర చేత విశ్వనాథ వారు అనేకానేక సాహిత్య ప్రక్రియలను,వ్యాకరణాంశాలను మనకు పరిచయం చేయటం నాకు నచ్చిన అంశం. అంతే కాక గణాచారి పాత్ర కూడ బాగుంటుంది. కధలో మలుపు రాబోతున్న విషయం పాఠకులకు ఈ పాత్ర ద్వారా సూచించడం జరుగుతుంది. మూఢ నమ్మకాలకూ, సనాతన సాంప్రదాయాలకూ, అధునికతకూ, ఇలా అన్ని అంశాలకు ఈ వేయిపడగలలో స్థానం కల్పించారు రచయిత. ఈ పుస్తకం గురించి చెప్పుకుంటూ పోతే, అదే రాసుకుంటూ పోతే పడగకో కాగితం చప్పున నేను వేయి కాగితాలు రాయాల్సొస్తుంది. అందుకే ఇక చాలు. విశ్వనాథ సత్యనారాయణ గారి "రామాయణ కల్పవ్రుక్షము" తెలుగు వారి ఇంటికి జ్ఞాన పీఠ పురస్కారాన్ని తీసుకొచ్చింది. ఇంతకీ ఇప్పుడు "వేయి పడగలు" ఎందుకు తలచుకున్నానో రాయాలిగా...ఈ రోజు విశ్వనాథ సత్యనారాయణ గారి పుట్టిన రోజు!
తెలుగు భాషకు సేవలందించిన మహానుభావులు ఎందరో...ముందుగా వారందరికి నా వందనాలు. ఒక వారం పది రోజుల నుంచీ ఒంట్లో నలతగా ఉండటం వలన మిమ్మల్ని కలవలేక పోయాను. సరిగ్గా ఈలోపే మన మాత్రుభాషా దినోత్సవం కూడా అయిపోయింది. 29వ తేదీన వ్రాయదలచింది ఇప్పుడు రాస్తున్నాగా.. ఆది కవి నన్నయ, విశిష్ఠ శబ్ద ప్రయోగముల చేత శబ్ద శాసనుడిగా బిరుదు పొందినా, శ్రీనాథుడు ప్రబంధ కవితలతో కవి సార్వభౌముడైనా, కాలాంతరంలో వీరి రచనలు పామర రంజకాలు కాలేక పోయాయి. పర దేశీయుల పాలనలో మనం ఉన్నప్పటికీ, కొందరు ఆంగ్లేయులు తెలుగు భాష మీద మక్కువ పెంచుకున్నవారు లేకపోలేరు. వ్యవహార భాషకూ, గ్రాంధికానికి ఉన్న తేడాను సామాన్య ప్రజలు పెద్దగా ఎత్తి చూపకపోయినా, ఈ దొరలు మాత్రం భాషాంతరాన్ని ప్రశ్నించారు. ఈ వరుసలో వ్యవహార భాషొద్యమానికి బీజం వేసిన వానిగా జె. ఎ. ఏట్స్ దొరని చెప్పుకోవాలి. దొర గారి ప్రశ్నకు సమాధానంగా గురజాడ, గిడుగు, పి.టి. శ్రీనివాస అయ్యంగార్ల త్రయం శిష్ట వ్యవహారిక భాషను బోధనాంశాలకు మాధ్యమంగా వాడాలని వ్యవహార భాషొద్యమానికి తెర తీశారు. అయితే గిడుగు రామమూర్తి పంతులు ఉద్యమాన్ని ప్రజలకూ, ప్రభుత్వానికి దగ్గరగా తీసుకెళ్ళారు. ఈ క్రమంలో తెలుగు అనే మాస పత్రికను కూడా నడిపారు. కేవలం తెలుగుకే కాక సవర అనే కొండ తెగ భాషకు విశిష్ఠ సేవలందించి, రావు బహదూర్ బిరుదు పొందారు గిడుగు వారు. వ్యవహార భాష కు ఇంతగా క్రుషి చేసిన గిడుగు వారి జన్మదినమైన 29.ఆగష్టున తెలుగు మాత్రుభాషా దినోత్సవం గా జరపుకోవడం నాకు చాలా ఆనందకరం. మీ అందరికీ మాత్రుభాషా దినోత్సవ శుభాకాంక్షలు. అన్నట్టు చివరిగా...గిడుగు వారు తూర్పు గోదావరి జిల్లా లోని తెలుగు భాషే ప్రామాణికముగా తెలిపారు. అంటే మాది రాజమండ్రి లెండి. కొంచెం స్వార్ధం.ఆయ్...మరి ఇంక ఉంటానండి.
ఇటు శ్రావణ మాసం పూజల హడావిడి ఇంట్లో, మరి రజియాకేమో రంజాన్ హడావిడి. రజియ లేనిదే ఆమ్మవాళ్ళింట్లో ఒక్క పనీ తెవలదు. లేచిన దగ్గర నుంచీ రజియ బేగం ఎప్పుడొస్తుందని గుమ్మంలో కూర్చోవడం అలవాటాయె! పెదనాన్న వాకిట్లో నిలబడి వేగిరముగనేతెంచెను బేగం అంటూ లోపలికి వస్తూ, దీన్నే సమస్యగా తీసుకుని పద్యం చెప్పమనగా. ఈ మూడు పద్యాలు గాట్టిగా చెప్పేశా, నా పుస్తకంలో రాశేశా, ఇప్పుడు బ్లాగేస్తున్నా. కంద పద్యానికి చాలా వరకూ దగ్గరగా ఉంటాయి ఈ ఆశువులు. చదవల్సిందే మరి...అబ్బా ! చదవండి...
ఈ నేల మీద పుట్టిన మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉన్నామంటే అది కొన్ని సంవత్సరాల పాటూ కొన్ని కుటుంబాలు, కొందరు వ్యక్తులు, తమ స్వలాభం చూసుకోకుండా సమాజ క్షేమం కోసం చేసిన త్యాగాలే. ఎందరి వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వారందరిని తలచుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు..... అన్నట్టుగా మనం స్వాతంత్ర్య సమర వీరులందరికీ అర్పించే నివాళి, వారిని తలచుకోవటమే. ఎందరో సమిధలైన ఈ స్వేచ్ఛా యజ్ఞంలో తెలుగువారు గర్వించదగిన వీరులు ఎందరో ఉన్నారు. కత్తి పట్టిన వారు కొందరైతే , కలం పట్టిన వారు కొందరు. అహింస మార్గంలో నడచినవారు ఇంకొందరు. అయితే మన దేశం యొక్క అస్థిత్వాన్ని ప్రపంచానికి చాటే జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గారు తెలుగువారవడం, మనం గర్వించాల్సిన విషయం. పింగళి వారు పుట్టినది కూడా ఈ నెల 2వ తేదీనే. బందరు లో పుట్టిన పింగళి వారు, ప్రాధమిక విద్యాభ్యాసం తరువాత పైచదువులకి కొలొంబొ వెళ్ళారు. భారత దేశం తిరిగివచ్చాకా ప్రభుత్వోద్యోగంలో చేరారు. గాంధీ గారు దక్షిణాఫ్రికా లో తిరుగుబాటు చేస్తున్న సమయంలో ఆకర్షితులైన పింగళి వారు, తరువాతి కాలంలో కాంగ్రెస్సు పార్టీకి జెండ అవసరమని సూచించారు. అలా మొదటిసారిగా రూపొందినది మువ్వన్నెల జెండా. అయితే కాలాంతరంలో, దీంట్లోని చరకా అశోకచక్రంగా మారి భారత దేశపు జాతీయ పతాకంగా అవతరించింది. మత సామరస్యానికి, సిరిసంపదలకు, అహింసకూ మన జెండాను ఎగరవేసి అప్పుడే 63 వర్షాలు గడిచాయి., అయినా మనం సాధించవలసినది ఎంతో ఉన్నది. మహా వీరుల త్యాగాన్ని గౌరవిస్తూ మనం శాంతి సామరస్యాలతో జీవిస్తూ, బుద్ధుని పుట్టుకకు సార్ధకత చేకూర్చుదాం. భారత మాతకు జయము జయము..........
ఈ రోజు అరుగు దగ్గర కూర్చుని నేనూ, మా వదినా కబుర్లు చెప్పుకుంటున్నంత సేపూ, నా ద్రుష్టంతా వాకిట్లోని గులాబీ మొక్కలపైనే. మాలతి వాసనల కోసం రాత్రి మళ్ళీ ఆరు బయటే కూర్చుందామని అనుకున్నాం. తెలియకుండానే మనసు పుష్పవిలాపాన్ని గుర్తుచేసుకుంటోంది. అందుకే కరుణశ్రీ (జంధ్యాల పాపయ్య శాస్త్రి) గారి అద్భుత రచనైన పుష్పవిలాపం మీతో పంచుకుంటున్నాను. సున్నితమైన భావజాలంతో పాటూ, కోపం, బాధ ఇందులో కనబడుతాయి. ఘంటసాల గొంతులో జీవం పోసుకున్న ఈ పుష్పవిలాపం చదవండి మరి...
నీ పూజ కోసం పూలు కోసుకు వద్దామని ప్రొద్దుననే తోటలోనికి వెళ్ళాను ప్రభూ. ఉదయశ్రీ అరుణారుణ కాంతులలో ఉద్యానం కళకళలాడు తున్నది. పూల బాలలు తల్లి వొడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు,
ఇంతలో ఒక గులాబి బాల కోపంతో ముఖమంతా ఎర్రజేసుకుని ఇలా అన్నది ప్రభూ. ఊలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచు కొందురు ముచ్చట ముడుల మమ్ము అకట! దయలేని వారు మీ యాడువారు
పాపం, మీరు దయా దాక్షిణ్యాలు గల మానవులు గాబోలునే ! మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !
ఓయి మానవుడా ! బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి? అందమును హత్య చేసెడి హంతకుండ! మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.
అని దూషించు పూలకన్నియల కోయలేక వట్టిచేతులతో వచ్చిన నా హృదయకుసుమాన్ని గైకొని నాపై నీ కరుణశ్రీ రేఖలను ప్రసరించుము ప్రభూ!
యద్దనపూడి సులోచనారాణి తన నవలా నాయకులను ఆరడుగుల అందగాడిలాగానూ, గిరజాల జుత్తు వాడిగానూ, రింగు రింగు పొగలూదే సోగ్గాడిలాగానూ, బాహ్య సౌందర్యాన్ని వర్ణించినా...ఆమె నాయికను మాత్రం చెక్కు చెదరని ఆత్మాభిమానానికి నిదర్శనంగా చూపుతుంది. యద్దనపూడి వర్ణనలో పాఠకులకు, నాయిక అందచందాల కన్నా కూడా, ఆమె వ్యక్తిత్వమే మనసులో నిలిచిపోతుంది. సెక్రెటరీ, హ్రుదయ గానం వంటి నవలలలో, నాయిక పాత్రలలో ఆత్మాభిమానమే కాక, స్త్రీ సహజమైన అమాయకత్వంతోబాటూ మొండితనం, మూర్ఖత్వం కనబడుతాయి. అయితే ఈ కీర్తికిరీటాలు ఇందుకు కాస్త భిన్నం అనే చెప్పుకోవాలి. కీర్తికిరీటాలు లో నాయకుడు తేజ పాత్ర, నాయిక అయిన స్వర్ణ కన్నా కూడా చాలా గాఢమైనది. తేజ చిన్నతనంలోనే తల్లిదండ్రులకి దూరమై, తాతగారింట్లోనే ఉంటూ, మేనత్త పెంపకంలో పెరుగుతాడు. తేజ పెద్దైన కొద్దీ, తనదైన ప్రపంచాన్ని నిర్మించుకుని, అందులోనే జీవిస్తూ, గిరిజనులకు సాయపడుతుంటాడు. చిననాటి జ్ఞాపకాలను మర్చిపోలేకా, స్వర్ణకు దగ్గర కాలేకా, తేజ పడే బాధే ప్రధానంగా ఉంటుంది. గొప్ప నాట్య మయూరి అయిన స్వర్ణకు జీవితంలో ఎదురైన ఆటుపోట్లను ఎదురుకునేలా, తేజ ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ఎలా కల్గించాడన్నది అసలు కధ అయినా, తేజ తల్లి రాజ్యలక్ష్మి వలనే కధకు పునాది పడుతుంది. రాజ్యలక్ష్మి జీవితాన్ని చిన్నగానే కధ మధ్యలో రచయిత్రి చెప్పినా, ఆమె పడే అంతర్మధనం, మానసిక వేదన కధలో అంతర్లీనంగా ప్రాముఖ్యతను వహిస్తాయి. జీవితం పట్ల ఆశావాహ ద్రుక్పధాన్ని, ఈ నవల చక్కగా ప్రతిబింబిస్తుంది. నేను చదివిన పుస్తకాలలో, ఈ కీర్తికిరీటాలకు ఎప్పటికీ ప్రధమ శ్రేణిలో స్థానం ఉంటుంది. వీలైనప్పుడు మీరు కూడా చదువుతారుగా....
భాషాభిమానం అనగానే ఠక్కున గుర్తొచ్చేది మన తమిళ తంబీలే. తమ భాషను వారు గౌరవించే విధానం ప్రశంసనీయం. తమిళ భాషకు ప్రాచీన భాష హోదాను దక్కించుకున్నా(ఇప్పుడు మనకీ ఉందనుకోండి..), మాత్రుభాషా దినోత్సవాలు ఘనంగా జరిపినా, అది మన తంబీలకే చెల్లింది. కన్నడ దేశీయుడైన రాయలు, తెలుగు భాషను ఆదరించి, దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ, ప్రాచుర్యం తీసుకొచ్చారు గానీ, తెలుగు వారమైన మనం, మన భాషను కాపాడుకోలేక పోతున్నాం. తెలుగు భాషకు ఎనలేని సేవలందించిన రాయల వారి 500 వర్షాల పట్టాభిషేక మహోత్సవములు మన ప్రభుత్వం నిర్వహించదలచటం హర్షణీయమైనా, అధిక శాతం ప్రచార పత్రికలను ఆంగ్లం లో మాత్రమే ముద్రించడం బాధాకరం!!!
సత్తిరాజు లక్ష్మీ నారాయణ గారు బాపు గా సుప్రసిద్ధులు.తెలుగింతి అందానికి పర్యాయ పదం బాపూ బొమ్మ అని ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. పదారణాల తెలుగు పడుచుల సొగసును, ప్రపంచానికి తన కుంచె తో పరిచయం చేశారు బాపు. ప్రాచీన భారతీయ చిత్రకళా శైలి లో బాపు బొమ్మలు దర్శనమిస్తాయి. తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ ముదురు రంగులలో భారతీయతను బాపు బొమ్మలు ప్రతిబింబిస్తాయి. నవరసాలకు చిత్ర రూపమిచ్చినా, రమాయణ ఇతిహాసానికి ఏక రూపమిచ్చినా, అది బాపు కి మాత్రమే సాధ్యం. నాకు ఇష్టమైన బాపూ బొమ్మ గంగావతరణం. బాగున్నాయి కదా ఈ బొమ్మలు!!!
బాపూ అనగానే అందమైన బొమ్మలెలా గుర్తొస్తాయో, రమణ అనే పేరు కూడా జ్ఞప్తికి వస్తుంది. బాపు-రమణల స్నేహం అటువంటిది. బాపూ బొమ్మల కొలువు పేర్చితే, ముళ్ళపూడి వెంకట రమణ ఆ బొమ్మల చేత అల్లరి చేయించి, మన ఇంట నవ్వుల పూవులు విరబూయించారు. బుడుగు గాడి అల్లరి, సీగాన పెసూనాంబా ఈ రోజుకీ నాకెంతో ఇష్టం. అయితే ఈ మిత్ర ద్వయం తమ ప్రతిభతో తెలుగు చలనచిత్ర సీమకు ఆణిముత్యాలంటి చిత్రాలను అందించింది.బాపూ, తెలుగు, హిందీ భాషల్లో 40 పైగా చిత్రాలను రూపొందించారు. వీటిలో, బంగారు పిచ్చిక, బుద్ధిమంతుడు, సంపూర్ణ రామయణం, సీతా కల్యణం, శ్రీ రాజెశ్వరివిలాస్ కాఫీ క్లబ్, శుభోదయం, ముత్యాలముగ్గు మొదల్కొని.. నా చంటప్పటి, పెళ్ళి పుస్తకం, మిస్టర్ పెళ్ళం వరకూ బాపు సినిమాలు నేను చాలానే చూశాను. అన్నింటి లోనూ ఒక సారూప్యతను గమనించవచ్చు. అదే కధానాయిక ఆహార్యం. పెద్ద వాలు జడ, పూలూ, కళ్ళకు కాటుక, చెవులకు రింగులు, కాలి పట్టాలు, చీరల్లో అందంగా, పక్కింటి అమ్మయిలా బాగుంటుంది.
అందమైన తెలుగు వాకిళ్ళు, ఉయ్యాల బల్లలు, మెలిక ముగ్గులు...ఇలా ప్రతీ సన్నివేశం లో తెలుగుదనం ఉట్టిపడుతుంది. బాపు ఊహలకు రమణ తన సంభాషణా చాతుర్యం తో ప్రాణం పోశారు. సీతా కల్యణం చిత్రం లో రామునికి ఒక్క సంభాషణ కూడా ఉండక పోవటం గమనార్హం. అలాగే, చారెడు-పిడికెడు-బారెడు అంటూ పెళ్ళిపుస్తకం లో దివ్యవాణి అందాన్ని, రాజేంద్ర ప్రసాద్ చేత తమాషాగా చెప్పించి, ఆ మాటల అర్ధాన్ని, ఒక పాటలో చెంపకు కన్నులు చారెడు-సన్నని నడుము పిడికెడు-దువ్వీ దువ్వక పువ్వులు ముడిచిన నల్లని నీ జడ బారెడు... అంటూ పూరించారు. బాగుంది కదా!!!
ఇంకా, అపార్ధసారధమ్మా(పెళ్ళి పుస్తకం), మంగళాస్త్రాలు(మంగళసూత్రమనమాట...సుందరకాండ సినిమా లో) వంటి పదప్రయోగాలు నవ్విస్తాయి. నా వరకూ బాపూ చిత్రాలలో చెప్పుకోదగిన ప్రయోగాలు...ఎప్పుడు చూసినా ఇద్దరు నాయికలతో అడిపాడే శోభన్బాబు చేత, ఏక పత్నీవ్రతుడైన రాముని పాత్ర వేయించటం(సంపూర్ణ రామయణం).అలాగే, వాణిశ్రీ తో మేకప్ లేకుండా నటింపచేయటం(గోరంత దీపం). సినిమాలే కాక, బాపు-రమణలు టి.వి సీరియళ్ళు కూడా చేశారు. హంపాంచ్(హిందీ), భాగవతం చాల ప్రసిద్ధి చెందినవి. హమ్మయ్య!!!! ఇక చాలు కదా..బాపూ గురించి నాకు తెలిసిందంతా దాదాపుగా బ్లాగేశా....ఉంటాను మరి ఇక సెలవు!!
10.ప్రేమ ముప్పిరి కొను వేళ నామము తలచే వారు రామ భక్తుడైన త్యాగ- రాజ నుతుని నిజ దాసులైన వా (రెందరో) ప్రేమ ముప్పిరి-కొను వేళ నామము తలచే-వారు రామ భక్తుడైన త్యాగ- రాజ నుతుని నిజ దాసులైన-వారు (ఎందరో)